అగ్రరాజ్యంలో మరోసారి కాల్పుల కలకలం
వరుస కాల్పుల ఘటనలతో అగ్రరాజ్యం అమెరికా దద్దరిల్లుతోంది. నిన్నటికి నిన్న షికాగోలో దోపిడిదొంగలు కాల్పులు జరపగా, తాజాగా హ్యూస్టన్, కాలిఫోర్నియాలో ఒకేరోజు కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హ్యూస్టన్లోని ఓ ఆటోమొబైల్ రిపేర్ షాపులోకి ఓ వ్యక్తి చొరబడి అక్కడున్న సిబ్బందిపై కాల్పులు జరిపారు. అనంతరం తనను తాను కాల్చుకుచి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో దుకాణంలో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు మృతిచెందారు. కాగా, కాల్పులకు పాల్పడినవ్యక్తి ఆ దుకాణంలో పనిచేసిన మాజీ ఉద్యోగే అని స్థానిక అధికారులు తెలిపారు. అయితే ఘటనకు గల కారణాలు తెలియరాలేదు.
మరోవైపు కాలిఫోర్నియాలోనూ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. దక్షిణ కాలిఫోర్నియాలోని ఓ న్యాయ కార్యాలయంలో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో దుండగుడు సహా మరో వ్యక్తి మృతి చెందారు. అయితే దుండగుడు తనకు తాను కాల్చుకుని చనిపోయాడా లేదా పోలీసు కాల్పుల్లో మృతి చెందాడా అన్న విషయం తెలియరాలేదు. రెండు ఘటనల్లోనూ దర్యాప్తు చేపట్టినట్లు అమెరికా పోలీసులు వెల్లడించారు.