త్వరలో మెట్రోరైలు నెలవారీ పాస్లు
నిత్యం ట్రాఫిక్ సమస్యతో సతమతమవుతున్న నగరవాసులకు ఇప్పటికే 30 కిలోమీటర్లలో అందుబాటులోకి వచ్చిన మెట్రోరైలుకు సంబంధించి త్వరలోనే నెలవారీ పాస్లను జారీ చేస్తామని మెట్రోరైలు మేనేజింగ్ డైరెక్టర్ డా.ఎన్వీఎస్రెడ్డి వెల్లడించారు. ఇదే అంశంపై ఆర్టీసి, ఎంఎంటీఎస్ అధికారులతో కూడా చర్చలు కొనసాగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం మెట్రోరైలు భవన్లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఎండి మాట్లాడుతూ 30రోజులు పూర్తి చేసుకున్న మెట్రోరైలులో ప్రతి రోజు సుమారు లక్షన్నర మంది రాకపోకలు సాగిస్తున్నట్లు, వీరిలో ఎక్కువ మంది చిన్నాచితక పనులు చేసుకునే వారే ఉన్నట్లు గుర్తించామన్నారు. ఉదయం, సాయంత్రం ఆఫీసు వేళల్లోనే ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారన్నారు. రోజుకి 2వేలు చొప్పున ఇప్పటి వరకు లక్షన్నర స్మార్ట్ కార్డులను విక్రయించినట్లు తెలిపారు. అంతేగాక, మెట్రోరైలు వేగం తక్కువగా ఉందని, ప్రతి స్టేషన్ రైలు రాకపోకలు సంబంధించి సరైన సమాచారం లేదని ప్రయాణికుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని ప్రతి స్టేషన్లో త్వరలోనే రైళ్ల రాకపోకల టైం టేబుల్ను అందుబాటులో ఉంచుతామన్నారు.