బిల్లులు చెల్లిస్తే.. పోలవరం పూర్తి చేస్తాం : చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేసేవరకు నిద్రపోను అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రకాశం బ్యారేజీ 60 వసంతాల వేడుకలు విజయవాడలో ఘనంగా నిర్వహించారు. 60 వసంతాల ప్రకాశం బ్యారేజీ సంచికను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లిస్తే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. 2018 జూన్ నాటికి గ్రావిటీతో నీళ్లు ఇవ్వాలని ఆలోచన చేశామన్నారు. పోలవరం నిర్మాణం పూర్తి చేయాలన్నదే నా జీవితాశయం. ఈ ఏడాది 12.5 శాతం వర్షపాతం తక్కుడ పడింది. దేశంలో ఎక్కడా లేని విధంగా 6.50 లక్షల పంటకుంటలు తవ్వాం. పంటకుంటల ద్వారా వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చాం అని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు చిన రాజప్ప, దేవినేని ఉమామహేశ్వరరావు, ఉపసభాపతి మండలి బుద్దప్రసాద్ పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.