Singapore: డేటా సెంటర్ గా హైదరాబాద్…. విజయవంతంగా సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటన

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) సింగపూర్ పర్యటన విజయవంతంగా సాగుతోంది. తొలిరోజు పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సింగపూర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ITE) తో తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో స్కిల్ డెవలప్ మెంట్ కు సంబంధించిన పరస్పర సహకారం అందించుకోవాలని నిర్ణయించారు.
పర్యటనలో భాగంగా తొలి రోజు తెలంగాణ రైజింగ్ టీమ్ సింగపూర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ITE) క్యాంపస్ ను సందర్శించింది. అక్కడ నిర్వహిస్తున్న స్కిల్ డెవెలప్ మెంట్ కోర్సులు, అధునాతన సదుపాయాలను పరిశీలించింది. అక్కడ శిక్షణ అందిస్తున్న దాదాపు 20 రంగాలకు చెందిన నిపుణులు, కాలేజీ సిబ్బందిని కలిసి మాట్లాడారు. ఆ తర్వాత ఐటీఈ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి బృందం చర్చలు జరిపింది.
హైదరాబాదులోని ఫోర్ల్ సిటీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కి సహకరించాలని ఐటీఈ ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. వివిధ రంగాల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా వివిధ కోర్సులు నిర్వహిస్తున్న తీరును ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. స్కిల్ డెవెలప్మెంట్ శిక్షణలో భాగస్వామ్యం కోసం పరస్పరం సహకరించుకోవాలన్న సీఎం ప్రతిపాదనకు ఐటీఈ ప్రతినిధి బృందం సానుకూలంగా స్పందించింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో కలిసి పని చేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది.
రెండోరోజూ పర్యటనలో ..రాష్ట్రంలో రూ.3,500 కోట్ల పెట్టుబడులకు ఎస్టీ టెలీ మీడియా గ్లోబల్ డేటా సెంటర్(ST Tele Media Global Data Center) ముందుకొచ్చింది. ముచ్చర్ల సమీపంలోని మీర్ఖాన్ పేటలో అత్యాధునిక ఏఐ(AI) ఆధారిత డేటా సెంటర్ క్యాంపస్ను స్థాపించేందుకు ఈ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (MoU) చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు సింగపూర్లోని ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్ ఆఫీస్ను శనివారం సందర్శించారు. కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సమక్షంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఎస్ టీటీ గ్రూప్ సీఈవో బ్రూనో లోపెజ్(STT Group CEO Bruno Lopez) ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. 100 మెగావాట్ల సామర్థ్యంతో హైదరాబాద్లో ఏర్పాటు చేసే అత్యాధునిక అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెడీ డేటా సెంటర్ను ఈ కంపెనీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నెలకొల్పనుంది.
భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా డేటా సెంటర్ సామర్థ్యాన్ని పెంచుకునే సదుపాయం ఇందులో ఉంటుంది. దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్లలో ఇది ఒకటిగా నిలుస్తుంది. దాదాపు రూ.3,500 కోట్ల పెట్టుబడులతో ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు ఆ కంపెనీ ముందుకురావటం తెలంగాణలో ఉన్న మౌలిక సదుపాయాలను, ప్రపంచస్థాయి అనుకూలతలను చాటి చెప్పింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడుతూ.. త్వరలోనే హైదరాబాద్ డేటా సెంటర్లకు రాజధానిగా అవతరిస్తుందని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల నిర్ణయం తీసుకున్నందుకు ఎస్టీటీ గ్లోబల్ కంపెనీ ప్రతినిధులను అభినందించారు. తెలంగాణతో కలిసి పనిచేయటం గౌరవంగా ఉందని ఎస్టీటీ మీడియా గ్లోబల్ డేటా సెంటర్స్ ప్రెసిడెంట్, గ్రూప్ సీఈవో బ్రూనో లోపెజ్ అన్నారు. మౌలిక సదుపాయాలతో పాటు తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రగతిశీల విధానాలు సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహకంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం అందించే సహకారంతో ఆర్థిక వృద్ధితో పాటు ఉపాధి కల్పన, స్థిరమైన డిజిటల్ భవిష్యత్తు నిర్మించాలనే ఉమ్మడి లక్ష్యం నెరవేరుతుందని అన్నారు.
ప్రపంచానికి హైదరాబాద్ డేటా హబ్గా మారుతుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఆధారిత రంగంలో వస్తున్న వినూత్న మార్పుల్లో హైదరాబాద్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని అన్నారు. ప్రస్తుతం ఈ కంపెనీ హైదరాబాద్లోని హైటెక్ సిటీలో డేటా సెంటర్ను నిర్వహిస్తోంది. కొత్త క్యాంపస్ ఏర్పాటుతో కంపెనీ కార్యకలాపాలను విస్తరించనుంది. ఈ కంపెనీ పదేండ్లలో మన దేశంలో ఒక గిగావాట్ సామర్థానికి విస్తరించాలనే భవిష్యత్తు లక్ష్యంతో తెలంగాణలో పెట్టుబడులు పెడుతోంది. దశాబ్దంలో ఈ కంపెనీ దాదాపు 3.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతుందని శ్రీధర్ బాబు అంచనా వేశారు.
సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వెంట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వీఎల్ వీ ఎస్ఎస్ సుబ్బారావు ఈ తెలంగాణ రైజింగ్ టీమ్ లో ఉన్నారు.