కనీవినీ ఎరుగని ఆషాఢ సారె… ఉక్కిరిబిక్కిరైన వియ్యాలవారు… గోదారోళ్లా మజాకా

(ఆషాఢం కావిడి) ఈ నేపథ్యంలోన వివరాల్లోకి వెళ్తే… యానాంకు చెందిన ఓ బైక్ షోరూమ్ యజమాని తోట రాజు కుమారుడు పవన్కుమార్కు రాజమహేంద్రవరానికి చెందిన వ్యాపారవేత్త బత్తిన రామకృష్ణ కుమార్తె ప్రత్యూషాదేవికి ఇటీవల వివాహం జరిగింది. ఆషాఢం మాసం రావడంతో వియ్యంకుడి ఇంటికి రామకృష్ణ ఆదివారం పంపిన ఆషాఢం సారె అందరినీ అబ్బురపరిచింది. స్టీలు బిందెల్లో 50 రకాల స్వీట్లు, 250 కిలోల కిరాణా, 200 ఆవకాయ జాడీలు,10 మేకపోతులు, 50 కోళ్లు, టన్ను చొప్పున కొర్రమేను, పండుగప్ప, బొచ్చె చేపలు, రొయ్యలు, 250 కిలోల బొమ్మిడాయిలు పంపించారు.
రాజమహేంద్రవరంలో పెళ్లి కుమార్తె ఇంటి నుంచి యానాంలోని పెళ్లి కుమారుడి ఇంటికి కావిళ్లలో ఊరేగింపుగా ఈ సారెను పంపించారు. ఈ విషయాన్ని రెండు ప్రాంతాల్లో వింతగా చెప్పుకుంటున్నారు. తోట రాజు వీటిని గ్రామంలో తెలిసిన వారందరికీ పంచారు. పెట్టిపోతలైనా, మర్యాదలైనా గోదారోళ్ల తర్వాతేనని మరోసారి రుజువైందని అందరూ చర్చించుకుంటున్నారు. గోదావరి మహారాష్ట్రలో పుడితే.. మర్యాదలు గోదావరి జిల్లాల్లో పుట్టాయన్న సామెత ఊరికే రాదు కదండీ..