Nara Lokesh: చేనేత వస్త్ర ప్రదర్శన ‘వసంతం-2025’ను ప్రారంభించిన మంత్రి లోకేష్
విజయవాడ: విజయవాడ ఎంజీ రోడ్డులోని శ్రీ శేషసాయి కల్యాణ వేదికలో క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ‘వసంతం-2025’ చేనేత వస్త్ర ఎగ్జిబిషన్ ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) లాంఛనంగా ప్రారంభించారు. క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ‘వసంతం-2025’ పేరుతో రెండు రోజుల వార్షిక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్ లో వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత, చేతివృత్తుల కార్మికులు తయారుచేసిన వివిధ ఉత్పత్తులను 70కిపైగా స్టాల్స్ లో ఏర్పాటుచేశారు. ఆయా స్టాల్స్ ను మంత్రి పరిశీలించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రకృతి సహజసిద్ధ రంగులతో తయారుచేసిన ‘కొత్తూరు వసంత వర్ణ’ నూతన చేనేత బ్రాండ్ ను మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సెక్రటరీ ఎస్.రంజన, ఇతర ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ సుజాత, సౌభాగ్యలక్ష్మి, పద్మ, శైలజ తదితరులు పాల్గొన్నారు.







