Google: గూగుల్ హైపర్స్కేల్ డేటా సెంటర్.. ఆంధ్రప్రదేశ్కు గేమ్ ఛేంజర్

టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) చరిత్రాత్మక ముందడుగు వేసింది. టెక్ దిగ్గజం గూగుల్ (Google), విశాఖపట్నంలో (Visakhapatnam) 1 గిగావాట్ సామర్థ్యంతో అతిపెద్ద హైపర్స్కేల్ డేటా సెంటర్ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. సుమారు 10 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.88,628 కోట్ల భారీ పెట్టుబడికి సంబంధించిన కీలక అవగాహన ఒప్పందం ఇవాళ ఏపీ ప్రభుత్వంతో ఢిల్లీలో కుదిర్చుకుంది. ఈ ప్రాజెక్ట్ కేవలం ఆంధ్రప్రదేశ్కే కాకుండా, యావత్ భారతదేశానికి టెక్నాలజీ రంగంలో ఒక గేమ్ ఛేంజర్ గా నిలవనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ డేటా సెంటర్కు గూగుల్ ఏఐ హబ్ (Google AI Hub) అని నామకరణం చేయనున్నారు. ఈ కేంద్రం భారతదేశంలోనే మొట్టమొదటి కృత్రిమ మేధస్సు (AI) కేంద్రంగా అవతరించనుంది. అంతేకాకుండా, ఇది అమెరికా వెలుపల గూగుల్ నిర్మిస్తున్న అతిపెద్ద డేటా సెంటర్ కావడం విశేషం. దీని వల్ల విశాఖ నగరం పూర్తిస్థాయి ఏఐ సిటీగా రూపాంతరం చెందనుందని అంచనా.
ఢిల్లీలోని తాజ్మాన్సింగ్ హోటల్లో జరిగిన ఈ కీలక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమక్షంలో ఒప్పందాల మార్పిడి జరిగింది. ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్తో పాటు గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే వంటి గూగుల్ ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. గతేడాది అక్టోబర్లో మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటన సందర్భంగా గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్తో జరిపిన చర్చలే ఈ చారిత్రక ఒప్పందానికి పునాది వేశాయి.
ఈ భారీ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ఊతం ఇవ్వనుంది. అంచనాల ప్రకారం, 2028-2032 మధ్య కాలంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (GSDP)కి ఏటా అదనంగా రూ.10,518 కోట్ల ఆదాయం సమకూరవచ్చు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 1,88,220 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా. ఈ డేటా సెంటర్తో పాటు విద్యుత్, రియల్ ఎస్టేట్, టెలికమ్యూనికేషన్స్ వంటి అనుబంధ రంగాల అభివృద్ధికి కూడా మార్గం సుగమం అవుతుంది. దీని ద్వారా రాష్ట్రానికి పన్నుల రూపంలో కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. గూగుల్ ఏఐ హబ్ గా నిలవడం ద్వారా, భారతదేశంలో కృత్రిమ మేధస్సు పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలకు విశాఖ ఒక కేంద్రంగా మారుతుంది. ఇది దేశంలోని టెక్నాలజీ స్టార్టప్లు, పరిశోధకులు, విద్యార్థులకు అపారమైన అవకాశాలను కల్పిస్తుంది.
రూ.88,628 కోట్ల భారీ పెట్టుబడి, భారతదేశంలో టెక్నాలజీ మౌలిక సదుపాయాల రంగంలో ఉన్న నమ్మకాన్ని, సామర్థ్యాన్ని అంతర్జాతీయంగా చాటి చెబుతుంది. హైపర్స్కేల్ డేటా సెంటర్ల ఏర్పాటు దేశంలోని డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుంది. ఇది క్లౌడ్ కంప్యూటింగ్ సేవలను మెరుగుపరచడం ద్వారా వ్యాపారాలు, ప్రభుత్వ సేవలు, సాధారణ వినియోగదారులకు వేగవంతమైన, సురక్షితమైన డిజిటల్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ ప్రాజెక్టు ఏపీని దక్షిణ భారతదేశంలో ఒక ప్రముఖ టెక్నాలజీ హబ్గా మార్చే ప్రభుత్వ లక్ష్యానికి ఒక బలమైన పునాది వేస్తుంది.
సీఎం చంద్రబాబు, గూగుల్ భాగస్వామ్యంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ డేటా సెంటర్ ఏపీని భవిష్యత్ టెక్నాలజీకి కేంద్రంగా మారుస్తుందని పేర్కొన్నారు. విశాఖపట్నంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటును ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ ట్వీట్ కు ఆయన రిప్లై ఇస్తూ గూగుల్ నిర్ణయాన్ని అభినందించారు. ఈ ప్రాజెక్టు, ఏపీ యువతకు భారీ ఉపాధి అవకాశాలను అందిస్తూ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునివ్వడం ఖాయమని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.