విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ భారీ క్యాంపస్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో దేశంలో అతిపెద్ద టెక్నాలజీ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ భారీ క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. సుమారు 1000 సీటింగ్ సామర్థ్యంతో యూనిట్ ఏర్పాటు చేయడానికి ఇన్ఫోసిస్ ముందుకు వచ్చినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. విశాఖ క్యాంపస్ ఏర్పాటుకు సంబంధించి ఆ సంస్థ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెడ్ నీలాద్రిప్రసాద్ విశ్రా, రీజనల్ హెడ్ అమెల్ కులకర్ణి మంత్రి అమర్నాథ్తో పాటు అధికారులతో సమావేశమయ్యారు. 1000 సీట్లతో ప్రారంభించి రానున్న కాలంలో మరింత విస్తరించి మూడువేల సీట్లకు పెంచే విధంగా ఇన్ఫోసిస్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ఈ యూనిట్ కోసం ఫ్లగ్ అండ్ ప్లే విధానానికి మధురవాడ సమీపంలో అందుబాటులో ఉన్న భవనాలను పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత సొంత భవనాన్ని సమకూర్చుకునే అంశాన్ని పరిశీలించనున్నట్లు తెలిపారు. ఐటీ రాజధానిగా విశాఖ ఎదగడానికి అన్ని రకాల అవకాశాలున్నాయని, ఇన్ఫోసిస్ రాకతో మరిన్ని దిగ్గజ కంపెనీలు తరలివస్తాయన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు.






