TTD: వీలునామాతో టీటీడీకి భారీ విరాళం
తిరుమల శ్రీవారికి కాలధర్మం తర్వాత వీలునామా ద్వారా ఓ వ్యక్తి భారీ విరాళాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కి ఇచ్చేట్టు ఏర్పాటు చేశారు. హైదరాబాద్కు చెందిన ఐఆర్ఎస్ అధికారి వైవీఎస్ఎస్ భాస్కర్ రావు (YVSS Bhaskar) ఇటీవల కాలధర్మం చెందారు. ఆయన చివరి కోరిక మేరకు ట్రస్టీలు ఎం. దేవరాజ్రెడ్డి, సత్యనారాయణ, లోక్నాథ్ టీటీడీకి వీలునామా సంబంధిత పత్రాలను అందజేశారు. రూ.3 కోట్ల విలువ చేసే నివాస గృహం, రూ.66 లక్షలను విరాళంగా ప్రకటిస్తూ భాస్కర్రావు వీలునామా రాశారు. వనస్థలిపురం (Vanasthalipuram)లో ఆనంద నిలయం పేరుతో ఉన్న 3,500 చదరపు అడుగుల విస్తీర్ణంలోని భవనాన్ని ఆధ్మాత్మిక కార్యకలాపాల కోసం వినియోగించాలన్న ఉద్దేశంతో టీటీడీకీ విరాళంగా ఇస్తున్నట్లు వీలునామాలో ఆయన పేర్కొన్నారు. బ్యాంకులో దాచుకున్న సొమ్ములో టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.36 లక్షలు, సర్వశ్రేయాస్, వేద పరిరక్షణ, గో సంరక్షణ, విద్యాదాన, శ్రీవాణి ట్రస్టులకు రూ.6 లక్షల చొప్పున విరాళంగా అందివ్వాలని భాస్కర్రావు పేర్కొన్నారు. తన జీవితాంతం వేంకటేశ్వర స్వామి సేవలో అంకితమై ఉండాలని ఆకాంక్షించిన భాస్కర్రావు అంతిమ కోరిక మేరకు ఆయన తదనంతరం ట్రస్టీలు టీటీడీకి చెందాల్సిన ఆస్తిపత్రాలు, చెక్కులను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి (Venkaiah Chowdhury ) కి అందజేశారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అందించారు. ఈ సందర్బంగా భాస్కర్రావు ట్రస్టీలను అదనపు ఈవో అభినందించారు.







