US-TRUMP: అమెరికా చేతిలో వెనెజువెలా చమురు.. అమ్మకాలకు సిద్ధమంటున్న ట్రంప్…!
నికోలస్ మదురో సర్కార్ ను కుప్పకూల్చిన అమెరికా .. ఇప్పుడు ఆదేశంలోని చమురును అమ్మేందుకు సిద్ధమవుతోంది. అమెరికా నియంత్రణలోని కొత్తచట్టం ప్రకారం.. ఈ అమ్మకాలకు రంగం సిద్ధమవుతోంది. దీన్ని చైనా, భారత్ సహా పలుదేశాలకు అమ్మకాలు చేసేందుకు ట్రంప్ సర్కార్ మార్గం సుగమం చేస్తున్నట్లు సమాచారం.
వెనెజువెలా నుంచి అమెరికాకు 30-50 మిలియన్ బ్యారెళ్ల చమురును అప్పగించనున్న నేపథ్యంలో దానిని ప్రపంచ దేశాలకు విక్రయించాలని అమెరికా యోచిస్తోందని.. అందులోభాగంగా భారత్కు కూడా చమురును అమ్మడానికి సిద్ధంగా ఉందని వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి. వెనెజువెలా చమురుపై యూఎస్ రిఫైనరీలే కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయని పేర్కొన్నాయి.
వెనెజువెలాలోని తాత్కాలిక అధికారులు అధిక నాణ్యత గల 30-50 మిలియన్ బ్యారెళ్ల చమురును యూఎస్కు అప్పగించనున్నట్లు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఈ వార్తలు వెలువడడం ప్రాధాన్యత సంతరించుకుంది. వెనెజువెలా నుంచి సేకరించిన చమురును మార్కెట్ ధరకే విక్రయిస్తామని.. ఆ డబ్బు తమ నియంత్రణలోనే ఉంటుందని ఇప్పటికే ట్రంప్ తెలిపారు. ఆ డబ్బును వెనెజువెలా, అమెరికా ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తామన్నారు. ఈ ప్రణాళికను తక్షణమే అమలుచేయాలని ఇంధన కార్యదర్శి క్రిస్ రైట్కు తాను ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. చమురు నిల్వలను నౌకల ద్వారా రవాణా చేసి.. నేరుగా అమెరికా ఓడరేవులలో దించనున్నట్లు వెల్లడించారు.






