US-India: చమురు కొనుగోళ్లపై ట్రంప్ వ్యాఖ్యలకు భారత్ ధీటైన కౌంటర్..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా (Russia) నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని భారత ప్రధాని నరేంద్ర మోడీ (Modi) తనకు హామీ ఇచ్చారని ఆయన వెల్లడించారు. ఈ నిర్ణయం మాస్కోను ఆర్థికంగా ఏకాకిని చేసే అంతర్జాతీయ ప్రయత్నాలలో ఒక ‘పెద్ద ముందడుగు’ అని ఆయన అభివర్ణించారు. బుధవారం వైట్హౌస్లో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ ఈ కీలక విషయాన్ని తెలిపారు. “భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంపై నేను సంతోషంగా లేను. అయితే, ఇకపై కొనబోమని ఆయన నాకు హామీ ఇచ్చారు” అని ట్రంప్ పేర్కొన్నారు. దీని తర్వాత చైనాను కూడా ఇదే విధంగా ఒప్పిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ తనకు హామీ
ఇచ్చారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం స్పందించింది. దేశ ఇంధన భద్రత, వినియోగదారుల ప్రయోజనాలే తమకు అత్యంత ప్రాధాన్యమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇంధన దిగుమతుల విషయంలో తమ విధానాలు పూర్తిగా దేశీయ అవసరాల మేరకే ఉంటాయని పేర్కొంది.
విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక ప్రకటన విడుదల చేస్తూ, “భారత్ భారీ మొత్తంలో చమురు, గ్యాస్ దిగుమతి చేసుకుంటుంది. అంతర్జాతీయంగా ఇంధన ధరల్లో ఒడిదొడుకులు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటమే మా ప్రథమ ప్రాధాన్యత. మా దిగుమతి విధానాలు పూర్తిగా ఈ లక్ష్యం ఆధారంగానే ఉంటాయి” అని వివరించారు.
“స్థిరమైన ఇంధన ధరలు, సరఫరాల భద్రత అనేవి మా ఇంధన విధానంలోని రెండు ప్రధాన లక్ష్యాలు. దీనికోసం మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఇంధన వనరులను విస్తృతం చేసుకుంటున్నాం” అని ఆయన తెలిపారు. ఇక అమెరికా విషయానికొస్తే, చాలా ఏళ్లుగా ఆ దేశం నుంచి ఇంధన సేకరణను పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని, గత దశాబ్ద కాలంలో ఇది క్రమంగా పెరిగిందని ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుత అమెరికా ప్రభుత్వం కూడా భారత్తో ఇంధన సహకారాన్ని పెంపొందించుకోవడంపై ఆసక్తి చూపుతోందని, ఈ విషయంపై చర్చలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు.