ఈ శతాబ్దం .. మన ‘జన’ శతాబ్దమే…
భారత్ లో జనాభా విస్ఫోటనం కొనసాగుతోంది.ఈశతాబ్ధంలో భారత్ అత్యంత జనాభా కలిగిన దేశంగా ఉండనుంది. చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించిన భారత్, ఈ శతాబ్దం మొత్తం అదే హోదాను కలిగి ఉంటుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. అదే సమయంలో చైనా ప్రస్తుత జనాభాలో దాదాపు సగం మంది తగ్గిపోతారని నివేదించింది. ఈ మేరకు ‘వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2024’ పేరిట ఓ నివేదిక విడుదల చేసింది.
‘‘2024లో భారత్ జనాభా 145 కోట్లు. 2054 నాటికి అది 169 కోట్లకు చేరుతుంది. అనంతరం క్రమంగా 150 కోట్లకు తగ్గుతుంది. అయితే, 2060 నాటికి 170 కోట్ల వద్ద గరిష్ఠానికి చేరుతుంది. తర్వాత 12% తగ్గుదల రేటుతో క్రమంగా దిగొస్తుంది’’ అని నివేదిక పేర్కొంది. ‘‘ప్రస్తుతం చైనా జనాభా 141 కోట్లు. 2054 నాటికి 121 కోట్లకు తగ్గుతుంది. 2100 నాటికి ఏకంగా 78.6 కోట్లు తగ్గి 63 కోట్లకు పడిపోతుంది. ఇది 1950ల నాటి ఆ దేశ జనాభాతో దాదాపు సమానం. 2024-54 మధ్య చైనా జనాభాలో భారీ ఎత్తున తగ్గుదల నమోదవుతుంది. ఈ కాలంలో చైనాలో 20 కోట్లు, జపాన్లో 2 కోట్లు, రష్యాలో కోటి జనాభా తగ్గనుంది. ఈ శతాబ్దం చివరి నాటికి భారత జనాభా చైనాకు రెండున్నర రెట్లు ఎక్కువగా ఉంటుందని నివేదిక వెల్లడించింది.
సంతాన సాఫల్యత రేటు పడిపోవడమే..
2024లో 820 కోట్లుగా ఉన్న ప్రపంచ జనాభా 2080ల్లో గరిష్ఠానికి చేరుతుంది. వచ్చే 50-60 ఏళ్లలో ప్రపంచ జనాభా 1030 కోట్ల వద్ద గరిష్ఠానికి చేరుకుని అక్కడి నుంచి దిగొస్తూ ఈ శతాబ్దం చివరకు 1020 కోట్లకు తగ్గుతుంది. సంతాన సాఫల్యత రేటు గణనీయంగా పడిపోవడమే జనాభా తగ్గడానికి కారణం’’ అని ఐక్యరాజ్యసమితి జనాభా విభాగాధిపతి జాన్ విల్మోత్ వివరించారు. ప్రస్తుతం ప్రపంచ సంతాన సాఫల్యత రేటు 2.25 వద్ద కొనసాగుతోంది.2054 వరకు పాకిస్థాన్ 38.9 కోట్ల జనాభాతో అమెరికాను దాటేసి జనాభా పరంగా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేశంగా అవతరిస్తుంది. ప్రస్తుతం 34.5 కోట్లతో మూడోస్థానంలో ఉన్న అమెరికా 2054 వరకు నాలుగో స్థానానికి పడిపోతుందని నివేదిక తెలిపింది.






