భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ ప్రస్థానం..?
ప్రధాని జస్టిన్ ట్రూడో వైఖరితో భారత్-కెనడా మధ్య సంబంధాలు తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి.ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు దర్యాప్తులో భాగంగా కెనడా ప్రభుత్వం ..భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ సహా ఇతర భారతీయ దౌత్యవేత్తలను అనుమానితులుగా పేర్కొన్న నిర్ణయంపై.. భారత్ తీవ్రంగా స్పందించింది. ఇప్పటికే ఈ హత్యకేసుకు సంబంధించి భారత వైఖరిని.. సంజయ్ కుమార్ వర్మ స్పష్టంగా తెలియజేశారు. ఇలాంటి తరుణంలో ఆయనను పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద నమోదు చేయడం కలకలం రేపుతోంది.
దౌత్యపరంగా మూడు దశాబ్దాల అనుభవం.. సుడాన్లో భారత అంబాసిడర్గా..
సంజయ్ కుమార్ వర్మ 1988 బ్యాచ్ ఐఎఫ్ఎస్ (ఇండియన్ ఫారిన్ సర్వీస్) అధికారి. ఆయన పట్నా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, అనంతరం ఐఐటీ ఢిల్లీ నుంచి ఉన్నత విద్య పూర్తి చేశారు.ఫిజిక్స్లో పట్టా పొందిన వర్మ, ఐఎఫ్ఎస్లో చేరిన తర్వాత హాంకాంగ్, చైనా, వియత్నాం, తుర్కియే, ఇటలీ తదితర దేశాల్లో దౌత్య సేవలు అందించారు.రిపబ్లిక్ ఆఫ్ సుడాన్లో భారత అంబాసిడర్గా పనిచేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. సుదీర్ఘ అనుభవంతో కూడిన వర్మ 2022 సెప్టెంబర్లో కెనడా హైకమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు.
రెండు దేశాల మధ్య తీవ్ర దౌత్య ఉద్రిక్తతలు 2023 జూన్లో ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ కెనడాలో హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు భారత ప్రభుత్వానికి సంబంధం ఉందని కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలు, రెండు దేశాల మధ్య తీవ్ర దౌత్య ఉద్రిక్తతలకు దారితీశాయి.అయితే, ఈ ఆరోపణలు కేవలం కుట్రపూరితమైనవి, నిరాధారమైనవని భారత్ కొట్టిపారేసింది.ఈ నేపథ్యంలో, భారత దౌత్యవేత్తలు, ముఖ్యంగా సంజయ్ వర్మ, కెనడాలో తమ సేవలను కొనసాగిస్తూ ఉన్నారు.






