మోడీ మా దేముడంటున్న కరేబియన్ కంట్రీ… డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్ ప్రకటన
కోవిడ్ మహమ్మారి విజృంభించి ప్రపంచాన్ని కకావికలం చేస్తున్న సమయంలో.. అతిచిన్న కరేబియన్ కంట్రీ డొమినిక్ రిపబ్లిక్ విలవిలలాడింది. వైరస్ ను అరికట్టడమెలాగో తెలియక తీవ్ర వేదన చెందింది. పెద్దపెద్ద దేశాలు తమ పౌరులను రక్షించుకోవడంపై ఫోకస్ పెట్టాయి. మరి ఈచిన్న దేశాన్ని ఎవరు కాపాడతారు..? ఎవరు పట్టించుకుంటారు..? ఈదశలో డొమినికా దేశానికి భారత్ అండగా నిలిచింది. రాకాసి వైరస్ ను నిలువరించేందుకు ఆస్ట్రాజెనికా కోవిడ్19 వ్యాక్సిన్లు అందించింది. దీంతో ఆదేశం కోవిడ్ వైరస్ కోరల నుంచి బయటపడింది. దేశాన్ని కలావికలం చేస్తున్న వేళ భారత్ అందించిన ఆపన్నహస్తంతో తెరిపినపడిన డొమినికా దేశం తన కృతజ్ఞత చాటుకుంది.
ప్రధాని మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం చేసిన సాయానికి గుర్తుగా మోడికి ‘ది డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్’ను ప్రదానం చేయనున్నట్లు ది కామన్వెల్త్ ఆఫ్ డొమినికా ప్రకటించింది. భారత ప్రభుత్వ ఉదార గుణాన్ని స్మరించుకుంటూ ఆ దేశ ప్రధాని హోదాలో ఉన్న మోడీకి తమ దేశ అత్యున్నత జాతీయ పురస్కారాన్ని ఇవ్వనున్నట్లు డొమినికన్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. గయానాలోని జార్జ్టౌన్ పట్టణంలో నవంబర్ 19 నుంచి 21వ తేదీదాకా జరిగే ఇండియా–కరికోమ్ శిఖరాగ్ర సదస్సులో మోడీకి ఈ అవార్డ్ను అందజేస్తారు.
‘‘2021 ఫిబ్రవరిలో ప్రధాని మోడీ ఆదేశాలతో భారతసర్కార్ మాకు 70,000 డోసుల ఆస్ట్రాజెనికా కోవిడ్19 వ్యాక్సిన్లు అందించింది. మా స్థాయికి అది పెద్ద సాయం కావడంతో వాటిలో కొన్నింటిని మా పొరుగు దేశాలకూ సాయంగా అందించగలిగాం. ఆరోగ్యం, వైద్యం, సమాచార సాంకేతిక రంగాల్లోనూ భారత్ మాకు ఎంతో సాయపడింది. అంతర్జాతీయ స్థాయిలో వాతావరణమార్పు నిరోధక చర్యలు చేపట్టడం, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకను గుణంగా ముందడుగు వేయడంలో మాకు వెన్నంటి నిలిచింది’’ అని ఆ దేశ ప్రధాని కార్యాలయం కొనియాడింది.






