యాపిల్ కీలక ప్రకటన
అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ మన దేశంలో త్వరలో రిటైర్ స్టోర్లను ప్రారంభించనుంది. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైలో ఈ స్టోర్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందు కోసం అవసరమైన ఉద్యోగులను నియామక ప్రక్రియను ప్రారంభించింది. యాపిల్ చాలాకాలం నుంచి మన దేశంలో ఉత్పత్తులను విక్రయిస్తోంది. కొన్నాళ్లుగా ఆన్లైన్లో నేరుగా ఉత్పత్తులను విక్రయిస్తున్నప్పటికీ, ఆఫ్లైన్లో మాత్రం థర్డ్ పార్టీ స్టోర్ల ద్వారా ఉత్పత్తులను విక్రయిస్తోంది. సొంతంగానే రిటైల్ స్టోర్లు ప్రారంభించాలని యాపిల్ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తోంది. అమెరికా, చైనాలో రిటైల్ స్టోర్లను యాపిల్ నిర్వహిస్తోంది. భారత్లో ప్రారంభించనున్న రిటైల్ స్టోర్స్ లో ఉద్యోగులు కావాలని యాపిల్ ప్రకటన ఇచ్చింది. టెక్నికల్ స్పెషలిస్టు, స్టోర్ లీడర్, స్పెషలిస్ట్ సీనియర్ మేనేజర్, ఆపరేటింగ్ ఎక్స్ఫర్ట్, మార్కెటింగ్ లీడర్, మేనేజర్ వంటి వివిధ హోదాలకు సంబంధించి మొత్తం వంద మంది ఉద్యోగులను యాపిల్ కంపెనీ తన కెరీర్స్లో ప్రకటన జారీ చేసింది. తొలుత న్యూఢిల్లీ, ముంబై నగరాల్లో ఈ స్టోర్లను ఏర్పాటు చేస్తారు. తరువాత కాలంలో పుణే, బెంగళూరు వంటి నగరాలకు విస్తరించాలని యాపిల్ నిర్ణయించింది. యాపిల్ ఐఫోన్ల తయారీని ఇండియాలో పెంచేందుకు కూడా ప్రయత్నిస్తోంది.






