Islamabad: తాలిబన్ల పేరు చెబితేనే వణుకుతున్న పాక్ సైన్యం.. కాపాడాలంటూ గల్ఫ్ దేశాలకు వేడుకోలు..!
తాము అంత బలమైన వాళ్లం… ఇంత పోటుగాళ్లం అని చెప్పుకునే పాకిస్తాన్ సైన్యం, ఆదేశ అగ్రనేతలు… పొరుగుదేశం ఆఫ్గనిస్తాన్ ను చూసి జడుసుకుంటున్నారు. జడుసుకుంటున్నారని చెప్పడం కాదు… తాలిబన్లను గెలికి తప్పు చేశామా అన్న ఆందోళనలో బెంబేలెత్తుతున్నారు.తమను మరోసారి గెలికితే.. ఈసారి పాక్ రాజధానిని నాశనం చేస్తామంటూ తాలిబన్ అధినాయకత్వం చేస్తున్న ప్రకటనలు.. పాకిస్తాన్ కు వణుకు పుట్టిస్తోంది. దీంతో తమను కాపాడాలంటూ గల్ఫ్ దేశాలను వేడుకుంటోంది పాకిస్తాన్. ఇటీవలే పరస్పర రక్షణ ఒప్పందం చేసుకున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పై భారీ ఆశలు పెట్టుకుంది.
యుద్ధ భయంతో పాకిస్థాన్ అగ్రనాయకత్వం విదేశాలకు పారిపోయినట్లు పలు కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం దాయాది దేశం అగ్ర నాయకత్వం సౌదీ అరేబియాలో ఉంది. పాక్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ రియాద్లో జరుగుతున్న ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్ (FII9) సమావేశంలో పాల్గొంటున్నారు. అలాగే ఆయన సౌదీ అగ్ర నాయకత్వంతో అనేక ద్వైపాక్షిక సమావేశాలను కూడా నిర్వహించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇదే సమయంలో సౌదీ అరేబియా నుంచి కొన్ని వందల మైళ్ల దూరంలో ఉన్న జోర్డాన్లో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ ఉన్నారు. బంగ్లాదేశ్లో దాయాది దేశ మిలిటరీ నంబర్ 2 మీర్జా షంషాద్ బేగ్ దౌత్యం చర్చల పేరుతో పర్యటిస్తున్నారు.
ఈ ముగ్గురు ప్రస్తుతం ఇస్తాంబుల్పై దృష్టి సారించారు. అక్కడ పాకిస్థాన్ పొరుగు దేశమైన ఆఫ్ఘనిస్థాన్ను శాంతింపజేయడానికి రెండు రోజులుగా చర్చలు జరుపుతోంది. వాస్తవానికి ఇప్పుడు దాయాది అగ్ర నాయకత్వం దేశం బయట ఉంది. అక్టోబర్ 2025లో కాబూల్, కాందహార్లలో పాకిస్థాన్ వైమానిక దాడులు ప్రారంభించినప్పుడు ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీనికి ప్రతిస్పందనగా ఆఫ్ఘన్ తాలిబన్లు పాకిస్థాన్ సరిహద్దు పోస్టులపై దాడి చేసి, డజన్ల కొద్దీ సైనికులను చంపారు. చివరికి ఖతార్, తుర్కియే మధ్యవర్తిత్వంతో రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ కుదిరింది.
కానీ ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇప్పటికి అలాగే ఉన్నాయి. ఏ క్షణంలోనైనా ఇరు దేశాల మధ్య యుద్ధం చెలరేగవచ్చు. తెహ్రిక్-ఎ-తాలిబన్ 2025లో పాకిస్థాన్లో 600 కంటే ఎక్కువ దాడులను చేసింది. ఈ దాడుల వల్ల దాయాది దేశంలో అంతర్గత భద్రతకు ముప్పు కలుగుతుందని పాక్ అధికారులు వెల్లడించారు. అందువల్ల పాకిస్థాన్ ఏ విధంగానైనా ఆఫ్ఘనిస్తాన్తో శాంతిని కోరుకుంటుంది. సోవియట్ రష్యా, అమెరికాపై ఇప్పటికే దెబ్బ కొట్టిన తాలిబన్లు, పాకిస్థాన్ను నాశనం చేయాలనుకుంటున్నారని పాక్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ విదేశాంగ విధానం బహుళ-ముఖ సమతుల్యతపై దృష్టి సారించింది.







