Lahore: రణరంగమైన లాహోర్ వీధులు.. నెత్తురోడిన టీఎల్పీ భారీ ర్యాలీ..!

పాకిస్తాన్ (Pakistan) లోని మతవాద పార్టీ తెహ్రీక్-ఎ-లబ్బైక్ పాకిస్థాన్ (TLP) భారీ ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా టీఎస్పీ చేపట్టిన ర్యాలీలో నిరసన కారులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో.. ఓ పోలీస్ అధికారి సహా పలువురు నిరసన కారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలతో లాహోర్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.
పాలస్తీనాకు మద్దతుగా ఇస్లామాబాద్లోని అమెరికా రాయబార కార్యాలయం వద్ద నిరసన తెలిపేందుకు టీఎల్పీ మద్దతుదారులు శుక్రవారం లాంగ్ మార్చ్ ప్రారంభించారు. ఇందులో భాగంగా లాహోర్లో పోలీసులు రోడ్లపై అడ్డుగా పెట్టిన కంటైనర్లను ఆందోళనకారులు తొలగించేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఈ క్రమంలో నిరసనకారులు పోలీసులపై కాల్పులు జరిపారని, ఈ ఘటనలో ఒక అధికారి మరణించగా, మరికొందరు గాయపడ్డారని పంజాబ్ పోలీస్ చీఫ్ ఉస్మాన్ అన్వర్ తెలిపారు. అయితే, పోలీసుల కాల్పుల్లోనే తమ మద్దతుదారులు ఎంతోమంది చనిపోయారని, గాయపడ్డారని టీఎల్పీ వర్గాలు ఆరోపించాయి.
ఈ ఘర్షణల్లో టీఎల్పీ పార్టీ అధినేత సాద్ రిజ్వీకి కూడా బుల్లెట్ గాయాలయ్యాయని, ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని పార్టీ ఒక ప్రకటనలో వెల్లడించింది. గాయపడటానికి కొద్దిసేపటి ముందు విడుదలైన ఒక వీడియోలో, సాద్ రిజ్వీ కాల్పులు ఆపాలని భద్రతా బలగాలను కోరుతూ, చర్చలకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పడం కనిపించింది. ఆ సమయంలో కూడా కాల్పుల శబ్దాలు వినిపించాయి. ఈ హింసాత్మక ఘటనల్లో నిరసనకారులకు చెందిన పలు వాహనాలు దగ్ధమయ్యాయి. ఇప్పటికే శనివారం జరిగిన ఘర్షణలకు సంబంధించి పోలీసులు 100 మందికి పైగా ఆందోళనకారులను అరెస్టు చేశారు.