ఉబెర్ ఉద్యోగులపై వేటు
కరోనా వైరస్ మహమ్మారి, లాక్డౌన్ సంక్షోభంతో క్యాబ్ సేవల సంస్థ ఉబెర్ ఇండియాలో తన ఉద్యోగులపై వేటు వేసింది. భారతదేశంలో 600 మందిని తొలగించింది. వివిధ స్థాయిలు, టీమ్ లలో వీరిని తొలగించినట్టు ఉబెర్ తాజాగా ధృవీకరించింది. డ్రైవర్, రైడర్ సపోర్ట్ ఇతర డివిజన్లలో భారతదేశంలో దాదాపు 600 మందిని తొలగిస్తున్నట్టు ఉబెర్ ఇండియా, దక్షిణ ఆసియా అధ్యక్షుడు ప్రదీప్ పరమేశ్వరన్ వెల్లడించారు. అలాగే ప్రతి ఒక్కరికి కనీసం 10 వారాల జీతం చెల్లింపు, రాబోయే ఆరు నెలలకు మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజ్, అవుట్ప్లేస్మెంట్ సపోర్ట్, ల్యాప్టాప్ల వాడకానికి అనుమతినిస్తున్నట్టు ఆయన తెలిపారు.
కోవిడ్ 19 ప్రభావం, రికవరీపై అనిశ్చితి నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం తప్ప వేరే మార్గం లేకుండా పోయిందన్నారు. ఈ తగ్గింపులు ఈ నెలలో ప్రకటించిన గ్లోబల్ జాబ్ కోతల్లో భాగమని పరమేశ్వరన్ సృష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 3700 మంది ఉద్యోగులను తొలగిస్తున్న మే మొదటి వారంలో ఉబెర్ ప్రకటించింది. లాక్డౌన్ కారణంగా పలు సంస్థలు ఆర్థికంగా కుదేలయ్యాయి. దీంతో ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి.






