తెలంగాణలో నిత్యావసరాలు పంపిణీ చేసిన నాట్స్
అమెరికాలో తెలుగువారి కోసం అనేక సేవా కార్యక్రమలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తెలుగునాట లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న పేదలకు తన వంతు సాయం చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా తెలంగాణలోని శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని నందమూరి నగర్, నిజాంపేట్ ప్రాంతాల్లో నాట్స్ 200 పేద కుటుంబాలకు నిత్యావసరాలు అందించింది. ఇక్కడ పేదలకు లాక్డౌన్తో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారనే విషయం నాట్స్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ శేఖర్ అన్నే దృష్టికి స్థానిక పెద్దలు తీసుకురావడంతో వెంటనే ఆయన స్పందించి పేద కుటుంబాలకు నిత్యావసరాలు అందించేందుకు సాయం చేశారు.
స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీ చేతుల మీదుగా పేద కుటుంబాలకు ఈ నిత్యావసరాలను పంపిణీ చేయడం జరిగింది. ఒక వైపు పనులు లేక..చేతులో డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్న తమకు నిత్యావసరాలు పంపిణీ చేయడం పట్ల పేదలు తమ హర్షం వ్యక్తం చేశారు. నాట్స్ నిరుపేదల ఆకలి తీర్చేందుకు ముందుకు రావడం అభినందనీయమని.. ఈ విషయంలో విజయ్ శేఖర్ అన్నే చూపించిన చొరవను ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ప్రశంసించారు.






