Newyork: ఎంఐటీ అధిపతిగా చంద్రకాసన్..
మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) ‘ప్రొవోస్ట్’(Provast) పదవికి ప్రొఫెసర్ అనంత చంద్రకాసన్ ఎంపికయ్యారు. ఎంఐటీకి అధిపతిగా పేర్కొనే ఆ పదవికి ఎంపికైన తొలి భారతీయ అమెరికన్గా ఆయన రికార్డులకెక్కారు. చెన్నైలో పుట్టిన చంద్రకాసన్ ప్రస్తుతం ఎంఐటీ చీఫ్ ఇన్నోవేషన్ అండ్ స్ట్రాటజీ ఆఫీసర్గా, ఇంజనీరింగ్ డీన్గా పనిచేస్తున్నారు. జూన్ 1 నుంచి ఆయన కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. ఎంఐటీ చీఫ్ అకడమిక్, బడ్జెట్ ఆఫీసర్ను ప్రొవోస్టుగా వ్యవహరిస్తారు. ప్రొవో్స్టకు విస్తృత అధికారాలు ఉంటాయి. ఫ్యాకల్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాలతో పాటు విద్యా సంస్థ పర్యవేక్షణ వరకు అన్నీ ఆ అధిపతే చూసుకుంటారు. దీనితోపాటు ఎంఐటీ వ్యూహాత్మక ప్రణాళిక ఆయన ప్రధాన బాధ్యతగా ఉంటుంది.
ఈ సందర్భంగా ఎంఐటీ ప్రెసిడెట్ మాట్లాడుతూ.. అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన సభ్యులలో నుంచి చంద్రకాసన్ను ఈ పోస్టుకు ఎంపిక చేశామన్నారు. చంద్రకాసన్ మాట్లాడుతూ.. ప్రొవోస్టు బాధ్యత తనకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. చంద్రకాసన్కు న్యూయార్క్లో భారత కాన్సులేట్ జనరల్ శుభాకాంక్షలు తెలిపారు.
ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో చంద్రకాసన్… బీఎస్, ఎంఎస్, పీహెచ్డీని కాలిఫోర్నియా వర్సిటీలో పూర్తి చేశారు. ఎంఐటీలో ఫ్యాకల్టీగా చేరిన తర్వాత 2006లో మైక్రోసిస్టమ్స్ టెక్నాలజీ ల్యాబొరేటరీస్ డైరెక్టర్గా పదోన్నతి పొందారు. 2011లో ఈఈసీఎస్ డిపార్ట్మెంట్ హెడ్గా, 2017లో స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ డీన్గా నియమితులయ్యారు. ఎంఐటీ చీఫ్ ఇన్నోవేషన్, స్ట్రాటజీకి తొలి ఆఫీసర్గా 2024లో నియామకయ్యారు.







