Delhi: ట్రంప్ ప్రతీకార ట్యాక్స్ లు.. భారత్ రియాక్షన్..?

భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ..ప్రతీకార సుంకాల మోత మోగించారు. భారత్పై 26శాతం టారిఫ్లు విధిస్తున్నట్లు వెల్లడించారు. దీని (Trump tariff on India)పై కేంద్ర వాణిజ్య శాఖ విశ్లేషణ ప్రారంభించింది. ఈ సుంకాలను తాము ఎదురుదెబ్బగా భావించడం లేదని వాణిజ్య శాఖ అధికారులు చెబుతున్నారు.
‘‘ట్రంప్ (Donald Trumps) ప్రకటించిన టారిఫ్ల ప్రభావం మన దేశంపై ఎంత ఉండొచ్చనే అంశాన్ని వాణిజ్య మంత్రిత్వ శాఖ విశ్లేషిస్తోంది. అయితే, ఇక్కడో మార్గం ఉంది. అమెరికా ఆందోళనలను ఏ దేశమైనా పరిష్కరించగలిగితే.. ఆ దేశంపై సుంకాల (Tariffs) తగ్గింపును ట్రంప్ యంత్రాంగం పరిశీలించే నిబంధన కూడా ఉంది. అందువల్ల ఇది మిశ్రమ ఫలితమే తప్ప.. భారత్కు ఎదురుదెబ్బ కాదు’’ అని సదరు అధికారి వెల్లడించారు.
ట్రంప్ విధించిన 26 శాతం టారిఫ్లో.. 10 శాతం సుంకం ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి వస్తుందని సదరు అధికారి తెలిపారు. మిగతా 16 శాతం ఏప్రిల్ 10 నుంచి విధించనున్నట్లు పేర్కొన్నారు. సుంకాల ప్రకటన సందర్భంగా భారత ప్రధాని మోడీ గురించి ట్రంప్ ప్రస్తావించారు. తనకు మోడీ గొప్ప స్నేహితుడని, అయితే భారత్ అమెరికాతో సరైన విధంగా వ్యవహరించడం లేదన్నారు. 52 శాతం సుంకాలను విధిస్తోందని ట్రంప్ అన్నారు.
భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక 1.30 గంటలకు.. వాషింగ్టన్ డీసీలో ట్రంప్ టారిఫ్లపై ప్రకటన చేశారు. ఈ రోజును ‘లిబరేషన్ డే’గా అభివర్ణించిన ఆయన.. అన్ని దేశాల వారూ తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో విక్రయించుకోవచ్చని.. అయితే కనీసం 10% సుంకం చెల్లించాలని స్పష్టం చేశారు. అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న ఇతర దేశాలపై మాత్రం.. ఆయా దేశాలు విధిస్తున్న సుంకాల్లో సగం మేర తాము విధిస్తున్నట్లు వెల్లడించారు. భారత్ తమ ఉత్పత్తులపై 52% సుంకం విధిస్తున్నందున, తాము 26% సుంకం విధిస్తున్నట్లు తెలిపారు.