Washington: రష్యాకు వ్యతిరేకంగా ఈయూను కూడగడుతున్న ట్రంప్..

భారత్, చైనాలపై వంద శాతం సుంకాలు వేయాలని సూచన..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) .. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ముందుగా పుతిన్ ను దారికి తెచ్చేందుకు ప్రయత్నించి విఫలమైన ట్రంప్.. ఇప్పుడు రష్యాపై వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించారు. దీంతో పాటుగా ఈ యుద్ధంలోకి యూరోపియన్ యూనియన్ ను దించారు. తాము ఇప్పటికే రష్యాపై పలు ఆంక్షలు విధించిన ట్రంప్.. ఇప్పుడు ఈయూను సైతం వంద శాతం ఆంక్షలు విధించాలని సూచించారు.
రష్యాపై ఆంక్షలు విధించే అంశంపై సీనియర్ అమెరికన్, ఈయూ అధికారులు వాషింగ్టన్లో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఈయూ అధికారులతో ట్రంప్ కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడారు. రష్యాపై ఆర్థికఒత్తిడి తీసుకువచ్చేందుకు భారత్, చైనాలపై 100 శాతం సుంకం విధించాలని సూచించినట్లు తెలుస్తోంది. చమురు కొనుగోలు చేయడం ఆపేస్తామనే వరకు ఈ టారిఫ్లను కొనసాగించాలన్నారు. ‘మేము ఇలా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ, యూరోపియన్ భాగస్వాములతో కలిసి ముందుకువస్తేనే దీన్ని అమలుచేద్దాం’ అని యూఎస్ అధికారి ఒకరు తెలిపారు. అమెరికా సూచనలు అమలుచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈసందర్భంగా ఈయూ అధికారులు పేర్కొన్నట్లు సమాచారం.
ఉక్రెయిన్లో త్వరగా శాంతి నెలకొల్పాలని ఈయూ కూడా భావిస్తుంది. ఈ క్రమంలో రష్యాపై ఒత్తిడి తెస్తేనే అది సాధ్యమవుతుందని ట్రంప్ పేర్కొన్నారు. దీంతో యూరోపియన్ నేతలు కూడా ఆ దిశగా ఆలోచన మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే భారత్, చైనా వంటి దేశాలపై ద్వితీయ ఆంక్షలు విధిస్తే నెలకొనే పరిణామాలపై వారు చర్చలు జరుపుతున్నారు.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండటంపై భారత్, చైనాలపై ట్రంప్ కొన్ని రోజులుగా గుర్రుగా ఉన్న ఉన్నారు. ఈ క్రమంలో భారత్పై 50 శాతం సుంకాలు విధించారు. ఇటీవల ఎస్సీవో సమ్మిట్కు భారత ప్రధాని మోడీ చైనాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధినేత పుతిన్తో భేటీ అయ్యి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. దీనిపై కూడా ట్రంప్ తన అక్కసును వెళ్లగక్కారు. మరోవైపు.. భారత్తో నెలకొన్న వాణిజ్య అడ్డంకులు తొలగించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ తన ట్రూత్ సోషల్లో పోస్టు పెట్టారు. ఈసందర్భంగా ప్రధాని మోడీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.