వరద గుప్పిట్లో 'న్యూయార్క్' ..
అమెరికా ఈశాన్య రాష్ట్రాలను భారీవర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా న్యూయార్క్లో కుండపోతగా వర్షం కురిసింది. దీంతో వీధులన్నీ జలమయంగా మారాయి. లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు ఇళ్లల్లోకి చేరింది. వరద కారణంగా రోడ్లపై పెద్దసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.సబ్ వేలలోకి వరద నీరు చేరడంతో అధికారులు అన్ని ట్త్రెన్స్ రద్దు చేశారు. న్యూయార్క్ ఎయిర్ పోర్ట్లోకి వరద చేరింది. దీంతో ఎయిర్ పోర్టును తాత్కాలికంగా మూసివేసి, విమానాలను మళ్లించారు.
కొన్ని గంటల్లోనే రహదారులు, రైలుపట్టాలపై భారీగా వర్షపు నీరు చేరింది. విమానాశ్రయంలో టెర్మినళ్లపైకి కూడా చేరిన వరద నీరు చేరింది. వరద వల్ల అనేక మార్గాల్లో ట్రాఫిక్ స్తంభించింది. దీంతో పలు రైలు, బస్సు సర్వీసులను రద్దు చేశారు అధికారులు. విమానాలు కూడా ఆలస్యమయ్యాయి. ప్రయాణికులంతా పడిగాపులు పడాల్సి వచ్చింది. వర్షాల తీవ్రత దృష్య్టా న్యూయార్క్లో అత్యవసర పరిస్థితి నెలకొంది. కొన్ని దశాబ్దాల తరువాత అతిభారీ వర్షాలు కురిసాయని న్యూయార్క్ గవర్నర్ తెలిపారు. దీంతో ఈ పరిస్థితి నెలకొందని ఆయన వెల్లడించారు. కాగా బ్రూక్లిన్ ప్రాంతంలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ విభాగం తెలిపింది. ఒక్క గంటలోనే 6 సెంటీమీటర్ల వర్షం కురిసిందని వెల్లడించింది..
విపరీతమైన వర్షపాతం కారణంగా న్యూయార్క్ సంద్రంలా మారింది.రోడ్లు నదులను తలపిస్తున్నాయి. ప్రజలు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని.. ప్రస్తుతం రోడ్డు మీద ప్రజలు ప్రయాణించవద్దు అంటూ హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రిసిల్లా ఫోంటెల్లియో అనే మహిళ తన కారులో మూడు గంటల పాటు చిక్కుకుపోయింది. తన జీవితంలో ఇలాంటి సంఘటనలు చూడలేదని ఫోంటెల్లియో చెప్పారు.
శనివారం కూడా భారీవర్షం కురుస్తుండడంతో వరద ముప్పు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వర్షం, వరదలకు సంబంధించి జాతీయ వాతావరణ శాఖ న్యూయార్క్ వాసులకు హెచ్చరికలు జారీ చేసింది. కుండపోత వర్షాల నేపథ్యంలో ఇళ్లల్లోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
రెండేళ్ల క్రితం సెప్టెంబర్ నెలలోనే అమెరికాలో వరదలు బీభత్సం సృష్టించాయి. బ్రూక్లిన్, క్వీన్స్ రాష్ట్రాల్లో వరదల కారణంగా గతేడాది 13 మంది చనిపోయారు. న్యూయార్క్ నగరం, లాంగ్ ఐలాండ్, హడ్సన్ వ్యాలీ అంతటా ఎమర్జెన్సీని ప్రకటించారు.ప్రస్తుతం నగరంలోని వర్షాలు, వరదలకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.