హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కాకుండా కాపాడాలంటే బీఆర్ఎస్ను గెలిపించండి: కేటీఆర్
తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిస్తేనే హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం కాకుండా అడ్డుకోగలమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసే అరాచకాలను అడ్డుకోవాలంటే.. బీఆర్ఎస్ పార్టీ 12 స్థానాల్లో విజయం సాధించాలని అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని వేములవాడలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్లో తెలంగాణకు అన్యాయం జరగకుండా అడ్డుకునే శక్తి బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందని.. 12 స్థానాల్లో గెలిపిస్తే.. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం కాకుండా, బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చకుండా అడ్డుకోగలగుతామని కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ అన్నారు.
ఇక ఈ ఎన్నికల్లో 10-12 ఎంపీ సీట్లు సాధించగలిగితే రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ శాసించే రోజు ఏడాదిలోపే వస్తుందని కేటీఆర్ అన్నారు. 70 ఏళ్ల వయసులో తుంటి విరిగినా, కుమార్తె జైల్లో ఉన్నా, నమ్మినవాళ్లు మోసం చేసి వేరే పార్టీల్లోకి వెళ్తున్నా.. కేసీఆర్ బస్సుయాత్ర పేరిట జనంలో తిరుగుతున్నారని ఆయన గుర్తుచేశారు. అనంతరం 2023 అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడిన కేటీఆర్.. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమను ఓడించలేదని.. తమని తామే ఓడించుకున్నామని కీలక వ్యాఖ్యలు చేశారు.