స్వాతంత్య్ర దినోత్సవ వేళ.. అమెరికాలో మళ్లీ
అమెరికాలో మరోసారి తుపాకీ మోత మోగింది. ఇల్లినాయిస్ రాష్ట్రంలోని షికాగో పట్టణంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆరుగురు మరణించగా, దాదాపు 20 మందికి గాయలయ్యారు. కచ్చితమైన మరణాల సంఖ్యను అధికారులు ధ్రువీకరించాల్సి ఉన్నది. హైల్యాండ్ పార్క్లో జులై 4 పరేడ్ జరుగుతున్న సందర్భంగా ఈ దుర్ఘటన చోటు చేసుకున్నది. దేశంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న తుపాకీ సంస్కృతికి చెక్ పెట్టేందుకు బైడెన్ సర్కార్ తగిన చర్యలు తీసుకుంటున్న క్రమంలో ఈ ఘటన జరగడం గమనార్హం. దుండగుడు ఒక్కసారిగా కాల్పులకు తెగబడడంతో అక్కడ భయానక పరిస్థితులు నెలకొన్నాయి. పరేడ్కు వచ్చిన వందలాది మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. 20`25 సార్లకు పైగా కాల్పుల శబ్ధాన్ని తాను విన్నానని మెల్స్ జెరెమ్స్కీ అనే ప్రత్యక్ష సాక్షి తెలిపారు. కాల్పులు చేసిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.