లోక్సభ కీలక నిర్ణయం.. ఎంపీ ఫైజల్ పై
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వ్యవహారం చర్చనీయాంశంగా మారిన వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్సీపీ నేత మహమ్మద్ ఫైజల్ పై గతంలో వేసి అనర్హత వేటును లోక్సభ సచివాలయం ఎత్తివేసింది. ఆయనపై అనర్హతను ఉపసంహరించుకుంటున్నట్లు, ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు లోక్సభ సెకట్రేరియట్ నోటిఫికేషన్ జారీ చేసింది. తన అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగానే ఈ నోటిఫికేషన్ రావడం గమనార్హం. 2009లో కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ సలీప్ాపై దాడి చేశారన్న కేసులో ఈ ఏడాది జనవరి 10న లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్ ను కవరత్తీ సెషన్స్ కోర్టు దోషిగా తేల్చింది. పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. తీర్పు వెలువడి మూడు రోజుల తర్వాత లోక్సభ సచివాలయం ఆయనపై అనర్హత వేటు వేస్తూ ప్రకటన జారీ చేసింది. ఫైజల్ కేరళ హైకోర్టు ఆశ్రయించడంతో సెషన్స్ కోర్టు తీర్పు అమలును నిలిపివేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో ఆయనపై పడిన అనర్హత వేటు చెల్లుబాటు కాకుండా పోయింది. అయినప్పటికీ ఫైజల్ సభ్యత్వాన్ని లోక్సభ సచివాలయం పునరుద్ధరించలేదు. దీన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టు ఆశ్రయించారు. ఈ పిటిషన్పై నేడు సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరపనుంది. ఈ నేపత్యంలో ఆయన లోక్సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించడం గమనార్హం.