వైసీపీకి ఓటు వేస్తే ఏం జరుగుతుందో.. ప్రజలంతా ఆలోచించాలి : చంద్రబాబు
రాష్ట్రంలో తిరుగుబాటు మొదలైందని, జగన్ ఇంటికి పోవడం ఖాయమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో నిర్వహించిన టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ రాజంపేట ప్రజల జీవితాలు బాగుపడాలంటే మిథున్ రెడ్డి ఓడిపోవాలన్నారు. వైసీపీకి ఓటు వేస్తే ఏం జరుగుతుందో ప్రజలంతా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. రాజంపేట జిల్లా ఏర్పాటు చేయకుండా ఇక్కడి వారికి అన్యాయం చేశారు. రాజంపేటను జిల్లా కేంద్రం చేసి అభివృద్ధి చేస్తాం. రాజంపేట, రాయచోటి, మదనపల్లె దేనికీ అన్యాయం చేయం. ఎక్కడైనా ప్రజాభిప్రాయం మేరకే పాలన జరగాలి. రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం కిరణ్ కుమార్ రెడ్డిది. మేం వచ్చాక అన్నమయ్య ప్రాజెక్టును బాగు చేసి, బాధితులు ఆదుకుంటాం. పేదలకు రెండు, మూడు సెంట్లు ఇంటి జాగా ఇచ్చి, ఇళ్లు కట్టించి ఇస్తాం. గాలేరు-నగరి కాలువ పూర్తి చేసి, కృష్ణా జలాలు తీసుకొస్తాం. ఏప్రిల్ నుంచే పింఛను రూ.4వేలు ఇంటి వద్దే ఇస్తాం. 3 నెలల బకాయిలు జులైలో ఇస్తాం. టీడీపీ మద్దతుదారుల పింఛన్లు తీసేశారు. మేం వచ్చాక ఇస్తాం. ఐదేళ్లలో యువతకు 20లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగం వచ్చే వరకు రూ.3వేల నిరుద్యోగ భృతి ఇస్తాం అని హామీ ఇచ్చారు.