కాళేశ్వరం ప్రాజెక్ట్లో అవకతవకలపై ప్రజాభిప్రాయం కోరిన రేవంత్ సర్కార్
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై ప్రజాభిప్రాయాన్ని కోరుతూ రేవంత్ రెడ్డి సర్కార్ ఓ పబ్లిక్ నోటీస్ రిలీజ్ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్లో జరిగిన నిర్మాణ పరమైన, నాణ్యత, నిర్వహణ లోపాలకు సంబంధించి ప్రజలంతా తమ ఫిర్యాదులు, నివేదనలను ప్రభుత్వానికి సమర్పించాలని ఈ ప్రకటన ద్వారా తెలంగాణ ప్రభుత్వం కోరింది. ప్రజలంతా తమ ఫిర్యాదులు, నివేదనలను సాక్ష్యాధారాలతో నోటరీ ద్వారా ప్రమాణ పూర్వక అఫిడవిట్ రూపంలో సీల్డ్ కవర్లలో పంపించాలని రాష్ట్ర ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ప్రకటన విడుదల చేశారు. ‘8వ అంతస్తు, డి బ్లాక్, బిఆర్కే భవనం, సచివాలయం వద్ద, హైదరాబాద్-500063' వద్ద ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బాక్స్లో ప్రజలంతా తమ ఫిర్యాదులను, నివేదనలను డిపాజిట్ చేయాలని, అన్ని పనిదినాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల సమయంలో తమ అఫిడవిట్లను దాఖలు చేయవచ్చని సూచించారు.
అంతేకాకుండా ఎవరైనా పోస్ట్ ద్వారా కంప్లయింట్స్ పంపాలనుకుంటే మే 31వ తేదీలోగా తమ అఫిడవిట్లను పోస్ట్ ద్వారా పైన పేర్కొన్న చిరునామాకు పంపవచ్చని పేర్కొన్నారు. తగిన సాక్ష్యాధారాలు లేని, నోటరీ ద్వారా పొందిన ప్రమాణ పత్రం లేని అఫిడవిట్లు తిరస్కరించబడతాయని తెలిపారు. ఇదిలా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్ ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.