ఆనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ హీరోయిన్...
80's లో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తన అందం, అభినయంతో ప్రేక్షకులని కట్టిపడేసిన హీరోయిన్ భానుప్రియ. స్వతహాగా కూచిపూడి డాన్సర్ అయిన ఈ కథానాయిక నృత్య ప్రధానమైన సినిమాల్లో నటించి మెప్పించింది. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వర్ణకమలం భానుప్రియ సినిమా ప్రస్థానంలో ఒక మైలు రాయిగా నిలిచింది. దాదాపు 150 కి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులని ఆకట్టుకున్న నటి భానుప్రియ. హీరోయిన్ గా అవకాశాలు తగ్గాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒక వెలుగు వెలిగింది.
ఇటీవల ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భానుప్రియ గుర్తు పట్టలేని విధంగా కనిపించారు. ఒకప్పటి అందాల నటి, తమ అభిమాన హీరోయిన్ ని చాలా రోజుల తర్వాత చూసిన అభిమానులు ఆవేదనకి గురయ్యారు. ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉంటూ తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎప్పటికైనా డాన్స్ స్కూల్ పెట్టి పిల్లలకి నృత్యం నేర్పించాలి అని ఇదివరకు ఇంటర్వ్యూల్లో భానుప్రియ తెలిపారు. ఈ దిశగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నప్పటికీ ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నట్లు తెలుస్తుంది.
రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఆరోగ్య పరిస్థితి గురించి వివరిస్తూ భానుప్రియ ఎమోషనల్ అయ్యారు. " క్రమంగా నేను నా జ్ఞాపక శక్తిని కోల్పోతున్నాను, ఇదివరకటిలా నాకు ఏమి గుర్తుండట్లేదు. ఇటీవల ఒక తమిళ సినిమా కోసం నేర్చుకున్న డైలాగ్స్ కూడా షూటింగ్ సమయంలో మర్చిపోయాను. ఎంతో ప్రాణంగా నేర్చుకున్న నృత్యానికి సంబంధించిన ముద్రలని కూడా మర్చిపోయాను " అని భానుప్రియ అన్నారు. ఈ తరుణంలోనే డాన్స్ స్కూల్ పెట్టాలన్న తన ఆలోచనని విరమించుకున్నట్లు ఆమె తెలిపారు. తన భర్త చనిపోయాకే ఈ అనారోగ్య సమస్య వచ్చింది అని భానుప్రియ వాపోయారు.