16వేల గుండె ఆపరేషన్ లు చేసిన డాక్టర్.. గుండెపోటుతో మృతి!
గుజరాత్ లో ఓ డాక్టర్ మరణం అందరినీ కలచివేస్తోంది. 16 వేల మందికి గుండె ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించిన ఓ డాక్టర్ గుండెపోటుతో మృతి చెందడం ఎంతో మందికి బాధ కలిగిస్తోంది. జామ్ నగర్ లో కార్డియాలజిస్టుగా పని చేస్తున్న డాక్టర్ గౌరవ్ గాంధీ స్థానికంగా ఎంతో ప్రసిద్ధి చెందారు. సోషల్ మీడియాలో కూడా ఆయన ఎంతో యాక్టివ్ గా ఉంటారు. గుండెపోటు, గుండె సంబంధిత ఆరోగ్య విషయాలను ఆయన ఎప్పటికప్పుడు ప్రజలతో పంచుకుంటూ ఉంటారు. గుండె ఆరోగ్యానికి తీసుకోవాల్సిన విషయాలను తెలియజేస్తుంటారు. గుండెను కాపాడుకుందాం అనే క్యాంపెయిన ద్వారా ఆయన ఎంతోమందికి చేరువయ్యారు.
సోమవారం సాయంత్రం ఆసుపత్రిలో రోగులకు చికిత్స అందించిన అనంతరం డాక్టర్ గౌరవ్ ఇంటికి వచ్చి భోంచేసి పడుకున్నారు. మంగళవారం ఉదయం 6 గంటలైనా కూడా నిద్ర లేవకపోవడంతో ఆయన కుటుంబసభ్యులు వెళ్లి నిద్రలేపారు. అయితే అప్పటికే ఆయన అపస్మారక స్థితిలో ఉన్నారు. దీంతో ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. డాక్టర్ గౌరవ్ వయస్సు 41 ఏళ్లు మాత్రమే. అతి తక్కునవ కాలంలోనే ఎంతోమంది రోగుల ఆదరాభిమానాలు చూరగొన్న డాక్టర్ గుండెపోటుతో మరణించడం తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది.
డాక్టర్ గౌరవ్ గాంధీ 1982లో జన్మించారు. జామ్ నగర్లోనే ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అహ్మదాబాద్ లో కార్డియాలజీలో స్పెషలైజేషన్ చేసి తన సొంతూరు జామ్ నగర్ లో పని చేస్తున్నారు. దాదాపు 16 వేల మందికి ఆయన ఇప్పటివరకూ యాంజియోగ్రఫీ, యాంజియోప్లాస్టీ సర్జరీలు చేశారు. అత్యధిక గుండె ఆపరేషన్లు చేసిన డాక్టర్లలో గౌరవ్ గాంధీ ఒకరు. నిత్యం గుండెపైనే పనిచేసే ఆయన ఇప్పుడు అదే గుండెపోటుకు గురికావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన ఎంతో యాక్టివ్ గా ఉంటారు. వయసు కూడా చిన్నదే. అలాంటాయనకు ఇంత అకస్మాత్తుగా గుండెపోటు రావడమేంటని చర్చించుకుంటున్నారు.
డాక్టర్ గౌరవ్ గాంధీ మాత్రమే కాదు.. ఇటీవలికాలంలో చాలా మంది ఆకస్మిక గుండెపోట్లకు గురవుతున్నారు. ఎలాంటి సింప్టమ్స్ లేకుండానే ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా కరోనా, తదనంతర పరిణామాలు ఈ గుండెపోట్లకు కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. వ్యాక్సీన్ల ప్రభావం కూడా ఉండొచ్చనే అనుమానాలు కూడా ఉన్నాయి. చిన్నపిల్లలు సైతం హార్ట్ ఎటాక్స్ తో చనిపోతుండడం చర్చనీయాంశంగా మారింది. గుండెపోట్లపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.