తెలుగమ్మాయికి అరుదైన గౌరవం.. 18 ఏళ్లకే ఆ దేశ చట్టసభకు
ప్రపంచ దేశాల్లో వివిధ రంగాల్లో భారతీయులు తమ సత్తా చాటుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన తెలుగమ్మాయికి అరుదైన గౌరవం దక్కింది. 18 ఏళ్ల యువతి న్యూజిలాండ్ ఎంపీగా ఎంపికై సంచలనం సృష్టించింది. ప్రకాశం జిల్లా టంగుటూరు గ్రామానికి చెందిన గడ్డం మేఘన న్యూజిలాండ్ యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా ఎంపికయ్యారు. ఇటీవల నామినేటెడ్ ఎంపీ పదవులకు ఎంపిక జరిగింది. ఈ నేపథ్యంలోనే సేవా కార్యక్రమాలు, యువత విభాగానికి ప్రాతినిధ్యం వహించే పార్లమెంటు సభ్యురాలిగా 18 ఏళ్ల మేఘనను ఎంపిక చేశారు. వాల్కటో ప్రాంతం నుంచి ఎంపీగా ఆమెను ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించారు.
మేఘన తల్లిదండ్రులు గడ్డం రవికుమార్, ఉష ఉద్యోగ రీత్యా 2001లోన్యూజిలాండ్ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అక్కడే పుట్టి పెరిగిన మేఘన కేంబ్రిడ్జిలోని సెయింట్ పీటర్స్ ఉన్నత పాఠశాలలో తన విధాభ్యాసం పూర్తిచేశారు. చిన్న తనం నుంచే సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. తన తోటి స్నేహితులతో కలిసి విరాళాలు సేకరించి, వచ్చిన వాటిని ఆనాథ శరణాలయాలకు ఇస్తున్నారు. వివిధ దేశాల నుంచి న్యూజిలాండ్కు వలస వచ్చిన శరణార్థులకు కనీస వసతులతో పాటు, విద్య, ఆశ్రమం కల్పించడంలో మేఘన కీలక పాత్ర పోషించారు. సేవలను గుర్తించిన న్యూజిలాండ్ ప్రభుత్వం ఆమెను పార్లమెంటు సభ్యురాలిగా ఎంపిక చేసినట్లు ప్రకటించింది. ఫిబ్రవరిలో ఎంపీగా మేఘన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా దేశంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలపై తన గళాన్ని పార్లమెంటులో వినిపిస్తానని మేఘన తెలిపారు. చిన్న వయసులోనే మేఘన ఎంపీగా కావడం తమ గ్రామానికే కాదు, రాష్ట్రానికే గర్వకారణమని టంగటూరు గ్రామస్థులు తెలిపారు.