గెలిపించకుంటే రక్తపాతమే: ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరపున పోటీ చేస్తున్న ట్రంప్.. సంచలన కామెంట్స్ చేశారు. కామెంట్స్ అనడం కన్నా..సొంత ప్రజలను హెచ్చరించారని చెప్పొచ్చు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులేస్తున్న ట్రంప్.. తనను అధ్యక్షుడిగా గెలిపించకుంటే దేశంలో రక్తపాతం తప్పదని హెచ్చరించారు. శనివారం ఓహియోలోని వాండాలియాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో .. ఈ హెచ్చరికలు చేశారు ట్రంప్.
నవంబరు నెలలో జరిగే అధ్యక్ష ఎన్నిక అమెరికా చరిత్రలో అత్యంత ముఖ్యమైనదిగా నిలిచిపోనుందన్నారు ట్రంప్. అధ్యక్ష భవనం 'వైట్ హౌస్'లో అడుగుపెట్టేందుకు తాను సాగిస్తున్న ప్రచారం.. దేశానికి కీలకమైన మలుపుగా మారబోతోందని అన్నారు. 'నవంబర్ 5వ తేదీని గుర్తుంచుకోండి. మన దేశ చరిత్రలో అత్యంత కీలకమైన తేదీ అని నేను భావిస్తున్నాను' అని అన్నారు. తన ప్రత్యర్థి అధ్యక్షుడు జో బైడెన్ను చెత్తగా ఆయన అభివర్ణించారు.
మెక్సికోలో కార్లను తయారు చేసి వాటిని అమెరికన్లకు విక్రయించాలనుకుంటున్న చైనా ప్రణాళికలకు తాను చెక్ పెడతానన్నారు ట్రంప్. అధ్యక్షుడిగా ఎన్నికైతే చైనా కార్లను ఇక్కడ విక్రయించబోనివ్వనని తేల్చి చెప్పారు. ఎన్నికల్లో తాను గెలవకపోతే రక్తపాతం తప్పదని, అయినప్పటికీ చైనా కార్లను అమెరికాలో అమ్మనివ్వనన్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై ఆందోళనలు వెల్లువెత్తడంతో ఆయన ప్రతినిధులు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
బైడెన్ పాలనలోని అస్తవ్యస్త విధానాలను ట్రంప్ విమర్శించారని తెలిపారు.అయితే ఇది మాత్రం.. ఓరకంగా చూస్తే అమెరికన్లను ఆందోళనకు గురిచేస్తున్న విషయమని చెప్పాల్సిందే. ఎందుకంటే క్యాపిటల్ హిల్స్ ఘటనతో .. అప్పట్లో అమెరికా ఉలిక్కిపడింది. దీనికి సంబంధించిన కేసును ఎదుర్కొంటున్నారు ట్రంప్. అయినా మరోసారి ఇలాంటి కామెంట్స్ చేయడం .. అమెరికన్లతో పాటు ప్రపంచదేశాలను కలవరపరుస్తోంది.