ఉద్యోగులకు షాక్ ఇచ్చిన డెల్... 6000 మందిపై
టెక్ దిగ్గజాలు లేఆఫ్స్ను కొనసాగిస్తుండటం ఉద్యోగుల్లో గుబులు రేపుతోంది. ఓవైపు ఉద్యోగుల సంఖ్యను కుదిస్తూనే హైరింగ్ను కూడా పరిమితంగా చేపడుతున్నట్టు డెల్ వెల్లడించింది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా డెల్ 6000 మంది ఉద్యోగులపై వేటు వేసింది. గత రెండేండ్లుగా తన కంప్యూటర్లను ఎక్కువ మంది ప్రజలు కొనుగోలు చేయకపోవడంతో ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నట్టు డెల్ తెలిపింది. విక్రయాలు పడిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టిన క్రమంలో ఉద్యోగులపై వేటు వేయక తప్పలేదని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఇక పీసీలతో పాటు క్లైంట్స్ సొల్యూషన్స్ గ్రూప్ నుంచి ఏడాది మొత్తానికి రాబడి పెరుగుతుందని డెల్ అంచనా వేస్తోంది. అయితే ఏడాది చివరి మూడు నెలల్లో ఈ రంగం నుంచి రాబడి 12 శాతం పడిపోయింది. రాబోయే రోజుల్లో కొంత గడ్డు పరిస్థితులు ఎదురైనా తమ ప్రోడక్ట్స్కు మెరుగైన డిమాండ్ ఉంటుందని డెల్ అంచనా వేస్తోంది.