ప్రజాగళంతో ప్రజల్లోకి...
పొత్తు ఖరారైంది. చిలకలూరిపేట ప్రజాగళం సభ సక్సెసైంది. ఇప్పుడు అదే ఊపును కంటిన్యూ చేయాలని టీడీపీ భావిస్తోంది. ఇప్పటికే.. బాదుడేబాదుడు, ప్రాజెక్టుల సందర్శన యాత్ర, రా...కదలిరా అంటూ దాదాపు ఏడాదిన్నరగా జనంలోనే ఉన్న చంద్రబాబు...ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రచార ఉద్ధృతి మరింత పెంచనున్నారు. ప్రజాగళం పేరుతో సరికొత్త కార్యక్రమానికి టీడీపీ శ్రీకారం చుడుతోంది. రానున్న 40రోజులు మరింత కీలకం కావడంతో ..పూర్తిసమయం ప్రజల్లోనే ఉండేలా చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అటు పవన్ కల్యాణ్, బీజేపీతో కలిసి ఉమ్మడి సభల్లో పాల్గొననున్నారు.
ఎన్నికల ప్రకటన కన్నా ముందే అభ్యర్థుల ఎంపిక, ప్రకటనలతో సిద్ధమైన చంద్రబాబు...ఇప్పుడు ప్రచారంలోనూ వినూత్న పంథా అనుసరిస్తున్నారు. ఇప్పటికే రా...కదలిరా అంటూ రాష్ట్రవ్యాప్తంగా సభలు నిర్వహించిన చంద్రబాబు...ఇప్పుడు మరోసారి జనంలోకి వెళ్లనున్నారు. ప్రతి నియోజకవర్గం టచ్ చేసేలా ఆయన పర్యటన రూపకల్పన జరుగుతోంది.. వైసీపీ అరాచకపాలన, జగన్ మోసాలను జనంలోకి తీసుకెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తొలి విడతగా నంద్యాల నుంచి గానీ, మార్కాపురం నుంచి గానీ ప్రజాగళం పర్యటనలు చంద్రబాబు ప్రారంభించనున్నారు.రచ్చబండ తరహాలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమాచారం. నియోజకవర్గంలో బహిరంగ సభలు అనంతరం ఆయా ప్రాంతాల్లో ఉన్న మేథావులు, విద్యావంతులతో కలిసి రచ్చబండ నిర్వహించనున్నట్లు తెలిసింది. దీనికి సుమారు 10వేల మందిని ఆహ్వానించే అవకాశం ఉంది. ఇప్పటికే బీసీ డిక్లరేషన్ సభ విజయంవతం కావడంతో...త్వరలోనే ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్ సభలు ఏర్పాటు చేసి అధికారంలోకి వస్తే తాము ఏం చేయాలనుకుంటున్నామో వివరించనున్నారు.
చిలకలూరిపేట సభ తరహాలో మరిన్ని సభలు నిర్వహించాలని టీడీపీ అధినేత భావిస్తున్నారు.. ఈసారి ప్రధాని మోడీతో సభా వేదికపైనే .. రాష్ట్రానికి ఎలాంటి మేలు చేయనున్నారన్న అంశంపైనా ప్రకటన చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ప్రధాని మోడీ నేరుగా జగన్ను విమర్శించకపోవడంపైనా దృష్టి సారించిన కూటమి నేతలు.. ఇది కూటమికి సమస్యాత్మకంగా మారకుండా తగిన జాగ్రత్తలు తీసుకోనున్నారు. తర్వాతి సభల్లో కరుకైన విమర్శలుంటాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా పొత్తువల్ల ఏపీకి ఎలాంటి లబ్ధి చేకూరుతుందన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే పవన్ కల్యాణ్తో కలిసి తాడేపల్లిగూడెం సభలో పాల్గొన్నచంద్రబాబు..రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సభలో మరో 7,8 నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు శంఖారావం పేరిట లోకేశ్ మలివిడత యాత్రలు నిర్వహిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈసారి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. జగన్ను గద్దె దించడమే లక్ష్యంగా ఏడాదిన్నరగా ఆయన ఒక్కొక్క అస్త్రాన్ని బయటకు తీస్తున్నారు. ఒంటరిగా పోరాటం చేయడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి జగన్ లబ్ధి పొందుతారని గ్రహించిన చంద్రబాబు...ఏడాదిన్నర క్రితమే ఆయనే నేరుగా పవన్ను వెళ్లి కలిసిశారు. ఆ తర్వాత అది ఇరుపార్టీల మధ్య పొత్తుకు బీజం పడింది. ఇప్పుడు కేంద్రంతో సఖ్యతగా ఉంటేనే రాష్ట్రాన్ని కాపాడుకోవచ్చన్న లక్ష్యంతో బీజేపీతో జట్టు కట్టినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.