ప్రజాగళం పేరుతోనే జనంలోకి చంద్రబాబు..!
ఆంధ్రప్రదేశ్ లో పొత్తులు కొలిక్కి వచ్చాయి. ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైంది. దీంతో పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికతో పాటు ప్రచారంపై దృష్టి పెట్టాయి. వీలైనంత త్వరగా అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసి జనంలోకి వెళ్లాలనుకుంటున్నాయి. ఇందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారవ్యూహంపై పార్టీ సీనియర్లతో చర్చించారు. విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు.
చిలకలూరిపేటలో టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి ఉమ్మడిగా ప్రజాగళం పేరుతో భారీ బహిరంగసభ నిర్వహించాయి. ప్రధాని మోదీ ఈ సమావేశానికి హాజరయ్యాయి. ఇటీవలికాలంలో జరిగిన భారీ బహిరంగసభగా దీన్ని కూటమి పార్టీలు చెప్తున్నాయి. ఈ మీటింగ్ తర్వాత కేడర్ లో మంచి ఉత్సాహం కనిపిస్తోంది. అందుకే ఈ జోష్ ను ఇలాగే కంటిన్యూ చేయాలనుకంటున్నారు ఆయా పార్టీల నేతలు. అందులో భాగంగానే ప్రజాగళం పేరుతోనే యాత్రలు చేపట్టాలని నిర్ణయించారు చంద్రబాబు.
పోలింగ్ కు ఇంకా దాదాపు 50 రోజులకు పైగా సమయం ఉంది. ఇప్పటి నుంచి జనంలో విస్తృతంగా చొచ్చుకెళ్లాలని టీడీపీ నిర్ణయించింది. ఇందుకోసం ఒక పేరు సజెస్ట్ చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులను కోరారు. వివిధ రకాల పేర్లపై చర్చించిన తర్వాత ప్రజాగళం అయితేనే బాగుంటుందని మెజారిటీ నేతలు అభిప్రాయపడ్డారు. చివరకు దాన్నే ఫైనల్ చేశారు.
ఇప్పటికే టీడీపీ పలు కార్యక్రమాల ద్వారా జనంలోకి వెళ్లింది. రాష్ట్రానికి ఇదేం ఖర్మ, రా కదలిరా, యువగళం.. లాంటి కార్యక్రమాలతో చంద్రబాబు, లోకేశ్ ప్రజల్లోకి వెళ్లారు. ఇప్పుడు ప్రజాగళం పేరుతో ప్రతీ నియోజకవర్గంలో యాత్ర ఉండేలా రూట్ మ్యాప్ రెడీ చేయాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. ఒకటి రెండు రోజుల్లోనే పెండింగ్ అభ్యర్థులను ప్రకటించేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. లోక్ సభ అభ్యర్థుల ప్రకటన కూడా పూర్తయిన తర్వాత ప్రజాగళం యాత్ర ప్రారంభం కానుంది.