పద్నాలుగా? పదిహేనా?
కృష్ణా పుష్కరాల ప్రారంభంపై గత ఏడాది వివాదం జరిగింది. ఉగాది పండుగ తేదీలపై కూడా పంచాంగకర్తల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. తాజాగా సంక్రాంతి పండుగ ఎప్పుడు? అన్న దానిపై కూడా భిన్న వాదనలు జరుగుతున్నాయి. ధృక్ సిద్ధాంత పంచాంగకర్తలు జనవరి 14న మధ్యాహ్నం 1.46లకు సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తున్నందున, ఆ రోజే మకర సంక్రమణమని చెబుతున్నారు. భారత సిద్ధాంత పంచాంగం కూడా ఇదే విషయం చెబుతోందని ఉదహరిస్తున్నారు. 13న భోగి, 14న సంక్రాంతి, 15న కనుమ పండుగలు జరుపుకోవాలని విజయవాడకు చెందిన పులిపాక చంద్రశేఖర శాస్త్రి పేర్కొన్నారు. మరోవైపు గంటల పంచాంగాలలో మకర సంక్రమణం 14వ తేదీన కాదని ఇప్పటికే ప్రచురించారు. ఆ రోజు రాత్రి 7:43 ని.లకు మకర సంక్రమణం జరుగుతున్నందున ఆ మర్నాడే మకర సంక్రమణ ప్రయుక్త ఉత్తరాయణ పుణ్యకాలం అంటూ పేర్కొన్నారు. అంటే 14వ తేదీన భోగీ, 15వ తేదీన మకర సంక్రాంతి, 16వ తేదీన కనుమ అవుతుందని గంటల పంచాంగాలు ఘోషిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే 14న భోగీ, 15న సంక్రాంతి అని సెలవుల జాబితా ప్రకటించింది.