Washington: పెట్టే, బేడా సర్దేయండి.. తాత్కాలిక వలసదారులపైనా ట్రంప్ కన్నెర్ర..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. వలసల విషయంలో అస్సలు రాజీ పడేదే లేదంటున్నారు. అయితే.. అక్కడితో ఆగని ట్రంప్.. తన విధానాలను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు.తాజాగా తాత్కాలిక వలసదారులపైనా ట్రంప్ (Donald Trump) కన్నెర్ర చేశారు. యూఎస్ వ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా వలసదారులకు తాత్కాలిక నివాస హోదాను (Temporary Status for Immigrants) రద్దు చేస్తున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ సంచలన ప్రకటన చేసింది.
క్యూబా, హైతీ, నికరాగ్వా, వెనెజువెలా దేశాలకు చెందిన లక్షలాది మంది వలసదారులకు చట్టపరమైన రక్షణను రద్దు చేస్తున్నట్లు హోమ్లాండ్ సెక్యూరిటీ విభాగం వెల్లడించింది. నెల రోజల్లో వారిని దేశం నుంచి బహిష్కరించనున్నట్లు తెలిపింది. 2022 అక్టోబరు తర్వాత ఆ నాలుగు దేశాల నుంచి అమెరికాకు వలస వచ్చిన దాదాపు 5,32,000 మందికి ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి. మానవాత పెరోల్ కార్యక్రమం కింద అమెరికాకు వచ్చిన వారిపై ఈ కొత్త విధానం ప్రభావం చూపనుంది. వీరంతా ఇతరుల ఆర్థిక సహకారంతో అమెరికాకు వచ్చారని, రెండేళ్ల పాటు యూఎస్లో నివసించడానికి, పని చేయడానికి తాత్కాలిక అనుమతులు పొందారని హోమ్లాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ వెల్లడించారు. వీరు ఏప్రిల్ 24న లేదా ఫెడరల్ రిజిస్టర్లో నోటీసులు ప్రచురించిన 30 రోజుల తర్వాత అగ్రరాజ్యంలో ఉండేందుకు లభించిన లీగల్ స్టేటస్ను కోల్పోనున్నారని తెలిపారు.
మానవతా పెరోల్ను విస్తృతంగా దుర్వినియోగం చేస్తున్నారని, దీనికి ముగింపు పలుకుతామని ట్రంప్ ఇదివరకే వెల్లడించారు. ఆ దిశగా అమెరికా సర్కారు చర్యలు చేపట్టింది. ఈ మానవతా పెరోల్ అనేది అమెరికాలో సుదీర్ఘకాలంగా ఉన్న వెసులుబాటు. యుద్ధం లేదా రాజకీయ అస్థిరత ఉన్న దేశాల ప్రజలు అమెరికాకు వచ్చి తాత్కాలికంగా నివాసం ఉండేందుకు వీలుగా అధ్యక్షుడు ఈ లీగల్ స్టేటస్ను కల్పిస్తారు. గతేడాది అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ దీని గురించి పలుమార్లు ప్రస్తావించారు. అక్రమ వలసదారులను బహిష్కరించడంతో పాటు కొందరు వలసదారులకు ఉన్న చట్టబద్ధమైన మార్గాలను కూడా ముగిస్తామని అప్పట్లో తెలిపారు.
అంతక్రితం ఉన్న నిబంధనల ప్రకారం.. ఇలా మానవతా పెరోల్ కింద అమెరికాకు వచ్చే వారు రెండేళ్ల పాటు చట్టబద్ధంగా దేశంలో ఉపాధి పొందొచ్చు. ఆ గడువు ముగిసిన తర్వాత మరింత ఎక్కువ కాలం ఉండేందుకు వీలుగా శరణార్థిగా లేదా వీసా కోసం దరఖాస్తు చేసుకునే సౌలభ్యం ఉండేది. అయితే, ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దరఖాస్తుల ప్రక్రియను నిలిపివేశారు. దీన్ని సవాల్ చేస్తూ పలు ఫెడరల్ కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.