Washington: నెగ్గిన ట్రంప్ పంతం..పనామా కెనాల్ లో అమెరికా నౌకలకు నో ట్యాక్స్…

Donald Trump: అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. అనుకున్నది సాధించారు. మిత్రదేశాలను బెదిరించి, భయపెట్టి… తాను అనుకున్నదానికి అంగీకరించేలా చేశారు. పనామా కెనాల్(Panama Canal) విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పంతం నెగ్గించుకొన్నారు. పనామా కెనాల్లో ప్రయాణించే సమయంలో తమ నౌకలకు ఛార్జీలు విధించరని అగ్రరాజ్యవర్గాలు వెల్లడించాయి. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగశాఖ కూడా ధ్రువీకరించింది. ‘‘అమెరికా ప్రభుత్వ నౌకలు ఇప్పుడు పనామా కెనాల్ నుంచి ఎటువంటి ఛార్జీలు లేకుండా ప్రయాణించవచ్చు. దీంతో మిలియన్ల డాలర్లు ఆదాకానున్నాయి’’ అని ఎక్స్లో చేసిన పోస్టులో పేర్కొంది. వాస్తవానికి కొన్నాళ్ల క్రితమే పనామా అమెరికాకు కొన్ని రాయితీలు ఇవ్వాలని నిర్ణయించుకొంది. ఈవిషయాన్ని ఆదివారమే విదేశాంగ మంత్రి రూబియో సూచాయగా వెల్లడించారు.
మరోవైపు అమెరికా రక్షణ మంత్రి హెగ్సే, పనామా పబ్లిక్ సెక్యూరిటీ మంత్రి ఫ్రాంక్ అలెక్స్తో ఫోన్లో చర్చించారు. తమ యుద్ధ నౌకలు ఈ కెనాల్ నుంచి ప్రయాణించినప్పుడు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఆ దేశం అంగీకరిస్తుందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సె వెల్లడించారు. దీంతో అమెరికా ప్రభుత్వ నౌకలకు దీని నుంచి భారీ మొత్తంలో నగదు మిగులుతుందని పేర్కొన్నారు. అదే సమయంలో అక్రమ వలసదారులపై ఆ దేశం తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోందని మెచ్చుకొన్నారు.
నవంబర్లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన నాటినుంచి ట్రంప్ పనామా కాల్వను తిరిగి స్వాధీనం చేసుకొంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇందుకోసం సైనిక శక్తిని కూడా వాడే అవకాశం ఉందని ఆయన సంకేతాలు ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా ఆ చిన్న దేశంలో ఆందోళన మొదలైంది. అమెరికాకు చెందిన 40 శాతం కంటైనర్లు పనామా నుంచి ప్రయాణిస్తాయి. చైనాకు చెందిన సంస్థలు ఇక్కడి ఓడరేవుల్లోనే పెట్టుబడి పెట్టడాన్ని ట్రంప్తో సహా ఆయన విదేశాంగ మంత్రి రూబియో కూడా తప్పుపట్టారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక తాము చైనాకు చెందిన బీఆర్ఐ ప్రాజెక్టులోని కాంట్రాక్టులు పునరుద్ధరించుకోమని పనామా అధ్యక్షుడు జాస్ రౌల్ మోలినో హామీ ఇచ్చారు. ట్రంప్ ఇప్పటికీ అసంతృప్తిగా ఉన్నా.. ఆ దేశం కొన్నింటికి అంగీకరించడంతో కొంత మెత్తబడ్డారు.
నౌకాయాన భారం తగ్గిస్తూ.. అట్లాంటిక్-పసిఫిక్ సముద్రాలను కలుపుతూ అమెరికా భారీ వ్యయప్రయాసలతో పనామా కాల్వను 1914లో నిర్మించింది. దీనిని తొలుత అమెరికానే నిర్వహించింది. కానీ, పనామా దేశంలో దీనిపై తీవ్ర అసంతృప్తితో ఘర్షణలు చెలరేగడంతో.. 1977లో నాటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీకార్టర్ కీలక నిర్ణయం తీసుకొన్నారు. ఈ కాల్వను ఆ దేశానికి అప్పజెబుతూ ఒప్పందం చేసుకొన్నారు. ఈ కాల్వ తటస్థంగా ఉండి తీరాలని అమెరికా షరతు విధించింది. ఇక్కడ ఎటువంటి ముప్పు వచ్చినా అమెరికాకు దానిని రక్షించుకొనే హక్కు ఉంటుందని పేర్కొంది. ఆ తర్వాత పనామా ప్రభుత్వం కూడా ఈ కాల్వ అభివృద్ధికి భారీ మొత్తంలోనే ఖర్చు చేసింది.