Revanth Reddy: బెట్టింగ్ యాప్స్ పై రేవంత్ సంచలన నిర్ణయం

తెలంగాణా(Telangana) అసెంబ్లీలో సిఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేసారు. ఆన్ లైన్ యాప్స్, ఆన్ లైన్ రమ్మీ, ఆన్ లైన్ బెట్టింగ్స్, డిజిటల్ బెట్టింగ్ గేమ్స్ పై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని స్పష్టం చేసారు. కేవలం ప్రచారం కల్పించేవారిని విచారించడం ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదన్నారు. పక్క రాష్ట్రాలు, పక్క దేశాల్లో కూడా విచారణ చేయాల్సి ఉంటుందని తెలిపారు. అందుకే అవసరమైన చర్యలు తీసుకునేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
ఎవరైనా ప్రత్యక్షంగా, పరోక్షంగా బెట్టింగ్ యాప్స్ ను ప్రోత్సహించినా, నిర్వహణలో భాగస్వాములైనా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. అవసరమైతే చట్ట సవరణ చేసి శిక్షను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వ్యసనాలకు తెలంగాణలో తావులేదని స్పష్టం చేసారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని కొందరు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏ చిన్నసంఘటన జరిగినా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోందన్నారు. నడిబజారులో న్యాయవాద దంపతులను నరికి చంపితే ఆనాటి ప్రభుత్వం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఆనాటి వెటర్నరీ డాక్టర్ అత్యాచార ఘటన విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు రేవంత్. మహిళలపై జరిగిన అత్యాచారాల్లో 2020 లో దేశంలోనే రాష్ట్రం నాలుగో స్థానంలో ఉందని.. బాధితులపై సానుభూతితో ఉండి…నేరగాళ్లపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేసారు. కానీ ఇలాంటి ఆరోపణలు చేసి ప్రభుత్వంపై దురుదేశాన్ని ఆపాదిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా శాంతిభద్రతలు క్షీణించాయని దురుద్దేశంతో మాట్లాడుతున్నారని.. తెలంగాణ అభివృద్ధిపై యాసిడ్ దాడులు చేస్తున్న పరిస్థితి ఉందన్నారు.
రాష్ట్రాన్ని దివాళా తీయించి తెలంగాణ ప్రతిష్టను మసకబార్చేలా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కుట్రలను తెలంగాణ సమాజం సహించదన్నారు. అధికారం లేకపోతే క్షణం కూడా ఉండలేమన్న తరహాలో వారు వ్యవహరిస్తున్నారని ఇది తెలంగాణ సమాజానికి ఏ రకంగా మేలు చేస్తుంది? అని నిలదీశారు. 15 నెలలుగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పాలన సాగిస్తున్నామన్నారు. అప్పుడే మీకు అంత అసహనం ఎందుకు? కడుపునిండా విషం పెట్టుకుని ఎందుకు మాట్లాడుతున్నారు? అని మండిపడ్డారు.