Assembly: 12 నుంచి తెలంగాణ బడ్దెట్ సమావేశాలు.. అస్త్ర,శస్త్రాలతో పార్టీలు సిద్ధం..

తెలంగాణ (Telangana) రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly Budget Sessions) ఈనెల 12న ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధ్యక్షుడు (BRS Chief), ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్ ( KCR) హాజరుకానున్నారు. ఈ నేపధ్యంలో బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు సమావేశం జరగనుంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు ఆయన దిశా నిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చామన్నారు కేసీఆర్. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్ను ఎండగడుతామని కేసీఆర్ స్పష్టం చేశారు.
బుధవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకాగానే గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మరుసటి రోజు (గురువారం) రెండు సభల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదం తెలుపుతారు. అసెంబ్లీ సమావేశాలకుసంబంధించి ఎర్రవల్లి ఫాంహౌజ్లో పార్టీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు తాజాగా ఎమ్మెల్సీకి సంబంధించి అభ్యర్థి ఎంపిక, ఏప్రిల్ 27న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావదినోత్సవం, అలాగే బడ్జెట్ సమావేశాలపై కూడా చర్చించారు.
ఏప్రిల్ 27న జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరోవైపు ఎమ్మెల్యేల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై సమావేశంలో చర్చకు వచ్చింది. రెండు స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను వెనక్కి రప్పించేలా కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు కూడగట్టేలా బీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ 27 నాటికి 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి అడుగుపెట్టబోతోంది. దీంతో సిల్వర్జూబ్లీ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు.ఇందులో భాగంగానే హైదరాబాద్ లేదా వరంగల్లో బహిరంగ సభ నిర్వహించాలని ఆయన ఆలోచిస్లున్నట్లు సమాచారం. అలాగే ఏప్రిల్ 10న బీఆర్ఎస్ ప్రతినిధుల సభ హైదరాబాద్ వేదికగా జరుగుతుందని గతంలో కేటీఆర్ ప్రకటించారు. గత పదేళ్లుగా పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ సంస్థాగతంగా అంత బలంగా లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు అనుబంధ విభాగాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్న కేసీఆర్.. కొత్తగా కమిటీలు వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.