Mahesh Kumar : కడుపునిండా విషం పెట్టుకొని.. కౌగిలించుకొన్నట్లుగా : మహేశ్కుమార్ గౌడ్

కుల సర్వే, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కీలకమైన ఈ నిర్ణయాలను అభినందించేందుకు కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) కు మనసు రావడం లేదని విమర్శించారు. గతంలో ఎన్నో బిల్లుల విషయంలో బీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చింది. బీసీలకు మేలు జరిగే నిర్ణయంపై మాత్రం కేసీఆర్ నోరు విప్పడం లేదు. కడుపునిండా విషం పెట్టుకొని కౌగిలించుకొన్నట్లుగా విపక్షాల ధోరణి ఉంది. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ బీసీలకు రిజర్వేషన్ల పెంపు అంశంపై ఏనాడూ దృష్టి పెట్టలేదు. మేం సాధించిన రిజర్వేషన్ల పెంపు కవిత (Kavitha) తన విజయంగా చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియను మేము చేపట్టినప్పుడు కవిత జైలులో ఉన్నారు. తీహార్ జైలు లో ఉన్న కవిత బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఎప్పుడు పోరాటం చేశారో చెప్పాలి. ఆమె మాటలు విని తెలంగాణ సమాజం నవ్వుకుంటోంది. కవిత ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో ఆమెకైనా స్పష్టత ఉందా? అని ఎద్దేవా చేశారు.