Congress: తెలంగాణ కాంగ్రెస్ లో మీనాక్షి మార్క్…

ప్రస్తుతం పాలిటిక్స్ చాలా మారిపోయాయి. అధికారంలో ఏ పార్టీ ఉంటే.. ఆపార్టీయే మాపార్టీ అంటూ నేతలు కండువాలు కప్పుకుంటున్నారు. అంతేనా.. పార్టీలో చేరడానికి ముందు షరతులుపెట్టి, వాటిని ఒప్పుకుంటేనే వస్తామంటున్నారు. ఈక్రమంలో అన్ని పార్టీల్లాగే కాంగ్రెస్ లోనూ జంపింగ్ జపాంగ్ నేతల హవా కనిపిస్తోంది. అయితే ఇవి నిన్నటి వరకూ .. ఇప్పుడు పార్టీలో మేడమ్ మార్క్ కనిపిస్తోంది. రైలు ప్రయాణమే కాదు… పార్టీనేతలను సైతం వర్గీకరిస్తున్నారు కొత్త ఇంచార్జ్ మీనాక్షినటరాజన్.
పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీగా ఉన్న దీపా దాస్ మున్షీ స్థానంలో వచ్చిన మీనాక్షి.. ఆరంభంలోనే తనమార్క్ ప్రదర్శించారు.అసలు .. పార్టీ నేతలను సైతం వారి ప్రస్థానాన్ని బట్టి వర్గీకరిస్తున్నారు మీనాక్షి. పార్టీ రాష్ట్ర శాఖలో ఉన్న అన్ని స్థాయిల నేతలను ఆమె మూడు వర్గాలుగా విభజించారు. ఆది నుంచి పార్టీలో కొనసాగుతున్న నేతలను తొలి వర్గంగా గుర్తించిన మీనాక్షి… వారిని సిసలైన పార్టీ నేతలుగా గుర్తించినట్లు సమాచారం.
ఇక రెండో విభాగంలో… 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిని చేర్చారు. వీరిలోనూ ఓ స్థాయి వరకు కేటగరైజేషన్ ను అంతగా పట్టించుకోని మీనాక్షి… జిల్లా స్థాయి, ఎమ్మెల్యే స్థాయి నేతల నుంచి ఆ పై స్థాయి వరకు ఏఏ కారణాలతో ఆయా నేతలు పార్టీలో చేరారన్న వివరాలను నమోదు చేస్తున్నట్లు సమాచారం. ఇక మూడో విభాగం కింద… పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరత పార్టీల నుంచి వచ్చి చేరిన నేతలను చేర్చారట. ఈ విభాగంలో ఆయా నేతల చేరికలకు గల కారణాలు తదితరాలను కూడా మీనాక్షి నోట్ చేశారట.
గతంలో ఏం జరిగిందో తనకు తెలియదని.. తన వర్కింగ్ స్టైల్ మాత్రం ఇదేనని తెగేసి చెబుతున్న మీనాక్షి… తాను అనుకున్నట్లుగా ఈ విభాగాల వర్గీకరణను ఇప్పటికే పూర్తి చేసినట్లుగా సమాచారం. పార్టీ అధికారంలో ఉంది కాబట్టి… త్వరలోనే ఖాళీగా నామినేటెడ్ పదవుల భర్తీ చేయాల్సి ఉంది. అలాగే తరచూ జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా స్తానిక సంస్థల ఎన్నికలు వస్తే..ఆయా పదవులకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అంతిమంగా తదుపరి ఎన్నికల్లో సీట్లను కేటాయించాలి. ఇవన్నీ కూడా ఈ విభాగాల వర్గీకరణ ఆధారంగానే జరగనున్నాయట. దీంతో.. ఈ వర్గీకరణ మంత్రంపై పార్టీలో పెద్ద చర్చే నడుస్తోంది.