chandrababu-revanth reddy: తెలుగు రాష్ట్రాల మధ్య జలరాజకీయం..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జల వివాదం మరింత తీవ్రరూపు దాల్చింది. అసలు తెలంగాణ ఏర్పడిందే నిధులు, నీళ్లు, నియామకాల ప్రాతిపదికన. ఉమ్మడి రాష్ట్రంలో తమకు రావాల్సిన వాటాను ఏపీ తమ ప్రాంతాలకు తరలించుకుపోయిందని ఇప్పటికీ … తెలంగాణ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవడంలో సక్సెస్ కావాలని పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా.. పాతబాస్ దగ్గర రేవంత్ రెడ్డి మాట్లాడలేని పరిస్థితి ఏర్పడిందని బీఆర్ఎస్(brs) ఆరోపిస్తోంది.
అయితే రాష్ట్రప్రయోజనాల విషయంలో రాజీప్రశ్నే లేదంటున్నాయి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు.ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును చేపట్టడంపై తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది.. ఏపీ సీఎం చంద్రబాబు తెరపైకి తీసుకువచ్చిన బనకచర్లకు సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరం చెప్పడం.. తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. తమ అభ్యంతరాలను పరిష్కరించి, ఏమైనా చేసుకోండంటోంది తెలంగాణ ప్రభుత్వం. దీంతో ఇది మరోస్థాయికి చేరింది.
బనకచర్ల ప్రాజెక్ట్పై తెలంగాణ సీఎం అభ్యంతరం తెలపడంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు.. సముద్రంలోకి వెళ్లే నీటిని తీసుకెళ్తే తప్పేంటి అంటూ ప్రశ్నించారు. వృధా నీటితో బనకచర్ల కడితే నష్టమేంటని.. కాళేశ్వరం కడితే తాము అభ్యంతరం తెలిపామా..? అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు.. నీరు వృధా కాకుండా మీరూ ప్రాజెక్ట్లు కట్టుకోండి అంటూ సూచించారు.. సముద్రంలోకి వెళ్లే వృధా నీటిని.. కరువు ప్రాంతాలకు తరలిస్తే బాధపడొద్దు.. అంటూ చంద్రబాబు సూచించారు.
కాగా.. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం గోదావరి-బనకచర్ల లింక్ పథకానికి రూపకల్పన చేసిందని రేవంత్ రెడ్డి కేంద్రానికి ఫిర్యాదు చేశారు. జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్కు కంప్లయింట్ చేసిన కొన్ని గంటల్లోనే ఏపీ సీఎం చంద్రబాబు స్పందించడం చర్చనీయాంశంగా మారింది.. ఈ వివాదంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.