KCR: ఈసారి బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్.. ఇక సభలో పొలిటికల్ వార్ ఫేర్…

ఫామ్ హౌస్ లో కూర్చుని మాట్లాడడం కాదు.. మేం వెయిటింగ్ ఇక్కడ అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి(revanth reddy). సభకు రావాలంటేనే కేసీఆర్ కు భయం.. అందుకే ఇక్కడకు రాలేదంటున్నారు బీజేపీ నేతలు. అసలు సార్ ఎందుకు సభకురావడం లేదని సగటు బీఆర్ఎస్ కార్యకర్తకు డౌట్లు వస్తున్నాయి. ఓ వర్గం వారు రావాలి సభకు.. అధికార పక్షాన్ని కేసీఆర్ తూర్పార బట్టాలని కోరుకుంటున్నారు. మరికొందరేమో సభకు కేసీఆర్ వస్తే… అధికార పక్షం నుంచి అనవసర మాటలు పడాల్సి వస్తుందని.. రాకుండా ఉండడమే బెటరంటున్నారు.
ఏదేమైనా కేసీఆర్ మాత్రం… చాలా కాలం తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతున్నారు. ఈనెల 9 నుంచి జరిగే తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటారు బీఆర్ఎస్ అధినేత. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం నుంచే పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఏడాదిన్నర కాలంగా మూడుసార్లు మాత్రమే తెలంగాణ భవన్లో సమావేశాలు నిర్వహించారు. రెండు వారాల క్రితం జరిగిన సమావేశంలోప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రకటించారు కేసీఆర్. పార్టీ ఆవిర్భావించి 25ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు బీఆర్ఎస్ అధినేత.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీశ్రేణులకు పిలుపునిచ్చిన కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇదే సమయంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండటంతో సభకు హాజరుకావాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. SLBC, కాళేశ్వరం, అప్పుల విషయంలో ప్రభుత్వ తీరును సభ సాక్షిగా కేసీఆర్ ఎండగడతారంటున్నారు బీఆర్ఎస్ నేతలు. గత బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. బడ్జెట్ తర్వాత మీడియా పాయింట్ వద్ద మాట్లాడి వెళ్లిపోయారు. ఒకరోజు అసెంబ్లీకి వచ్చి మొహం చాటేసారని అధికార పార్టీ ఆరోపించింది.
ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ నేతలు నోరు తెరిస్తే .. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి కేసీఆర్ అంటూ సవాల్ చేయడం.. మరోవైపు బీఆర్ఎస్ అధినేత సభకు రావడం లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం.. అనర్హత హెచ్చరికలు కూడా కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లేందుకు కారణాలుగా చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు.ఈ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరవడం పక్కా.. అధికార పార్టీ తప్పులను తూర్పార పట్టడం డబుల్ పక్కా అంటున్నారు ఆయన సన్నిహితులు. అయితే చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి వెళ్తున్న కేసీఆర్ ఏం మాట్లాడుతారన్నది ఆసక్తికరంగా మారింది.