Dubai: అమరావతిలో లైబ్రరీ ఏర్పాటుకు శోభా రియాల్టీ 100 కోట్ల విరాళం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) యూఏఈ పర్యటనలో భాగంగా దుబాయ్లోని ప్రముఖ సంస్థ శోభా రియాల్టి ఫౌండర్ చైర్మన్ పీఎన్సీ మీనన్తో భేటీ అయ్యారు. అమరావతిలో రూ.100 కోట్లతో ప్రపంచ స్థాయి గ్రంధాలయం ఏర్పాటుకు శోభా గ్రూప్ చైర్మన్ పీఎన్సీ మీనన్ విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రియాల్టి, టౌన్ షిప్లు, లగ్జరీ హోటళ్ల నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆయనను ఆహ్వానించారు. అమరావతిని ప్రపంచంలో అత్యుత్తమ నగరంగా నిర్మిస్తున్నామని సీఎం ఆయనకు వివరించారు. రాజధాని నిర్మాణంలో శోభా రియాల్టి సంస్థ కూడా భాగస్వామి కావాలని ఆహ్వానించారు. ఏపీకి వచ్చి రాజధాని నిర్మాణాన్ని పరిశీలించాలని కోరారు.
ఈ సమావేశంలో అమరావతిలో లైబ్రరీ ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రితో చర్చించారు. రూ.100 కోట్ల విరాళంతో వరల్డ్ క్లాస్ లైబ్రరీని నిర్మించనున్నట్లు ఈ సందర్భంగా శోభా రియాల్టీ ప్రకటించింది. శోభా రియాల్టి సంస్థ అమరావతిలో ప్రపంచ స్థాయి స్టేట్ లైబ్రరీ నిర్మించేందుకు ముందుకు రావటంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. గ్రంథాలయం నిర్మాణానికి ఇంత పెద్ద మొత్తంలో విరాళం ప్రకటించటంపై సీఎం చంద్రబాబు నాయుడు ఆయనకు ధన్యవాదాలు తెలియచేశారు.
తిరుపతి, విశాఖ వంటి నగరాల్లో రానున్న రోజుల్లో అనేక మార్పులు రానున్నాయని… మౌలిక సదుపాయాలపై భారీగా ఖర్చు చేస్తున్నట్టు వెల్లడిరచారు. ఆంధ్రప్రదేశ్ లో రియల్ ఎస్టేట్ రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంపెనీ ప్రతినిధులకు వివరించారు.
అమరావతి, విశాఖ, తిరుపతి వంటి ప్రాంతాల్లో కూడా బిజినెస్ ఐటీ పార్కులు, మాల్స్, హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లతో పాటు ఉన్నతశ్రేణి వర్గాలకు హౌసింగ్ ప్రాజెక్టులను చేపట్టేందుకు అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నిర్మితం అవుతున్న పారిశ్రామిక కారిడార్లు, పోర్టులకు అనుసంధానంగా ఇండస్ట్రియల్ టౌన్ షిప్, హౌసింగ్ ప్రాజెక్టులకు అవకాశం ఉందని ముఖ్యమంత్రి శోభా రియాల్టీ చైర్మన్ పీఎన్సీ మీనన్కు వివరించారు.
ఈ సందర్భంగా శోభా గ్రూప్ సంస్థ చేస్తున్న ఛారిటీని సీఎం అభినందించారు.తమ ఆదాయంలో 50 శాతాన్ని ఛారిటీగా ఖర్చు పెట్టడాన్ని ప్రస్తావిస్తూ తాము ఏపీలో పీ4 విధానాన్ని అవలంభిస్తూ అమలు చేస్తున్న జీరో పావర్టీ మిషన్ అంశాలను వివరించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ది అంశాలపై ఇరువురూ చర్చించుకున్నారు. ప్రస్తుతం తమ సంస్థ దుబాయ్తో పాటు ఓమన్, బహ్రెయిన్, ఖతార్, బ్రూనై దేశాల్లో ప్రాజెక్టులు నిర్వహిస్తోందని శోభా గ్రూప్ చైర్మన్ మీనన్ ముఖ్యమంత్రికి వివరించారు. భారత్ లోని 14 రాష్ట్రాల్లోని 27 నగరాల్లో శోభా రియాల్టీ ప్రాజెక్టులు చేస్తోందని.. ప్రత్యేకించి బెంగుళూరు, గుర్గాంవ్, చెన్నై, కేరళలోని హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టామని సీఎంకు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం దుబాయ్ ప్రభుత్వంలో సీనియర్ సలహాదారు హోదా పనిచేస్తున్న మీనన్ ఆ దేశం నుంచి కూడా పెట్టుబడులు వచ్చేలా సహకరించాలని కోరారు. వచ్చే నెల నవంబర్14, 15వ తేదీల్లో విశాఖలో పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తున్నామని…ఆ సదస్సుకు రావాలని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు.







