Nara Lokesh: ఏపీ అభివృద్ధే మా లక్ష్యం
వస్తున్న పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, భూముల కేటాయింపులు
ఇండియాటుడే కాంక్లేవ్లో రాష్ట్ర విద్య, ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్
ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు అనే బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారు, ఆ బ్రాండ్తోనే దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్, డాటా సెంటర్లు, ఐటి కంపెనీలు ఎపిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి, ఎపిలోని పరిశ్రమ అనుకూలమైన వాతావరణం కూడా పెద్దఎత్తున పరిశ్రమల రాకకు ప్రధాన కారణమని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) పేర్కొన్నారు. కోయంబత్తూరులో ‘‘ఎట్రాక్టింగ్ ఇన్వెస్టిమెంట్ ఫర్ ద సన్ రైజ్ స్టేట్’’ అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే నిర్వహించిన కాంక్లేవ్లో మంత్రి లోకేష్ రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు 15 నెలలుగా కూటమి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ సంధానకర్తగా వ్యవహరించారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… గత ఎన్నికల్లో మేం ఇచ్చిన సూపర్-6 హామీల్లో ప్రధానమైనది యువతకు 20లక్షల ఉద్యోగాల కల్పన. ఆ లక్ష్యసాధన కోసం మేం ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతున్నాం. టిసిఎస్ సంస్థ 25వేల ఉద్యోగాలు కల్పిస్తుంది… ఆ సంస్థకు 99పైసలకే భూమి కేటాయిస్తే తప్పేమిటి? కర్నాటక, తమిళనాడు, కేరళ, యుపి వంటి రాష్ట్రాలతో పోటీపడి పరిశ్రమలను రప్పించడానికే తక్కువ ధరకు భూమి, ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన ప్రోత్సాహకాలు అందిస్తున్నాం.
ఆక్వా ప్రత్యామ్నాయ మార్కెట్ వెదుక్కుంటాం
హైదరాబాద్లో ఎయిర్ పోర్టు నిర్మాణానికి 5వేల ఎకరాలు ఎందుకని అప్పట్లో చాలామంది రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేశారు, ఈరోజు శంషాబాద్ ఎయిర్ పోర్టు దేశంలోనే అత్యుత్తమ పోర్టుల్లో ఒకటిగా ఉంది. ఎయిర్ ట్రాఫిక్ రద్దీని తట్టుకునేం దుకు ఇప్పుడు బెంగుళూరులో రెండో ఎయిర్పోర్టు నిర్మిస్తున్నారు. ట్రంప్ సుంకాల నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ఆక్వా మార్కెట్ను కాపాడు కునేందుకు ప్రభుత్వం తరపున మద్దతు ఇవ్వడమేగాక రష్యా, చైనా, యూరప్లలో ప్రత్యామ్నాయ మార్కెట్ లు వెదుక్కుంటాం, సవాళ్లను అవకాశంగా తీసుకుంటా మని లోకేష్ చెప్పారు. స్టాన్ఫోర్డ్లో చదువుతోపాటు యువగళం పాదయాత్ర సవాళ్లను ఎదుర్కొనే మార్గాలను నేర్పించిందని లోకేష్ తెలిపారు.
తప్పుచేస్తే ఎవరినీ క్షమించరు
భారత్ మల్టీ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఆవిష్కృతమవున్న తరుణంలో పారదర్శకమైన రాజకీయాలు అవసరమని మేం బలంగా విశ్వసిస్తు న్నాం. రాజకీయ నాయకులపై ఉన్న కేసులకు సంబంధించి ఏడాదిలోగా విచారణ పూర్తిచేసి, తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టు గతంలో మార్గదర్శకాలు ఇచ్చింది. దురదృష్టవశాత్తు అది అమలు కావడం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఎవరినీ ఉద్దేశపూర్వకంగా జైలులో పెట్టాలని భావించడం లేదు. ఇదే సమయంలో తప్పుచేసిన శిక్ష అనుభవించక తప్పదు. చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేశారని మేం ప్రతీకార రాజకీయాలు చేయబోం. నేను తప్పుచేసినా చంద్రబాబు నన్ను జైలుకు పంపుతారు.
రైతుల అంగీకారంతోనే భూసమీకరణ
అమరావతి నిర్మాణానికి రైతుల అంగీకారంతో 35 వేల ఎకరాలను సమీకరించాం. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టాం. భారతదేశం అభివృద్ధికి అమరావతి లాంటి మరో వంద నగరాల నిర్మాణం జరగాలి. జనవరిలో అమరావతికి 158 బిట్ క్వాంటమ్ కంప్యూటర్ రాబోతోంది. త్వరలో నైపుణ్యం పోర్టల్ ప్రారంభించబోతున్నాం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వర్టికల్, హారిజంటల్గా చర్యలు చేపడతున్నామని లోకేష్ చెప్పారు.
మాకు ఏపీ ప్రయోజనాలే ముఖ్యం
మాకు ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలే ముఖ్యం. వారిపట్ల మాకున్న నిబద్ధతవల్లే 40 ఏళ్లుగా వారి హృదయాల్లో చోటు కల్పించారు. తెలుగుదేశం పార్టీ మిగిలిన ప్రాంతీయ పార్టీలకంటే భిన్నమైంది. తరాలు మారినా మేమంతా కలసికట్టుగా ముందుకు సాగుతున్నాం. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో విజేతలైన వారిలో 50 శాతం మంది తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలే. 25 మంది మంత్రుల్లో 17 మంది కొత్తవారు. మేము కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనప్పటికీ పెట్టుబడుల ఆకర్షణలో ఇతర అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీపడుతున్నాం. ఫార్చ్యూన్ 500 కంపెనీలతో పాటు ఇతర ప్రముఖ సంస్థలు ఎపి వైపు చూస్తున్నాయి. స్పేస్ సెక్టార్ అభివృద్ధికి ఇటీవల 200 ఎకరాల భూమి కేటాయించాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు ఇది దోహదపడుతుంది. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ సంస్థను కర్నాటక తిరస్కరించాకే మేం ఆహ్వానం పలికాం. హ్యాండ్లూమ్స్, టెక్సైటైల్ రంగాలపై కూడా దృష్టిసారించాం.







