అమెరికాకు పెరిగిన ఎగుమతులు
రాష్ట్రం నుంచి జరుగుతున్న ఎగుమతుల్లో ఎక్కువగా అమెరికా, చైనా, యూఏఈ, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఇటలీ, వియత్నాం, జపాన్, కెనడా దేశాలకు ఎగుమతులు జరుగుతున్నాయి. ఇందులో అత్యధికంగా అమెరికాదే అగ్రస్థానం కావడం విశేషం. 2021-22 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు ఏకంగా రూ. 11,866 కోట్ల ఎగుమతులు జరిగాయి. తర్వాత స్థానంలో చైనా (రూ.8,307 కోట్లు), యూఏఈ (రూ.4,358 కోట్లు) ఉన్నాయి. ఎగుమతుల్లో సింహభాగం సముద్ర ఉత్పత్తులదే. అలాగే ఎగుమతుల్లో వృద్ధికి అవకాశమున్న అన్ని అంశాలనూ సద్వినియోగం చేసుకుంటూ.. విశాఖపట్నంలోని పోర్టులు తమ జోరును కొనసాగిస్తున్నాయి. దేశ విదేశీ ఎగుమతులకు కస్టమ్స్ శాఖ అనుమతులను సులభతరం చేయడంతో విశాఖ నుంచి సరుకు రవాణా మరింత వేగం పుంజుకుంటోంది. 24/7 కస్టమ్స్ అధికారులు పోర్టులో అందుబాటులో ఉంటూ.. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా వన్టైమ్ పర్మిషన్ విధానం అమలుచేస్తున్నారు. దీని ద్వారా డైరెక్ట్ పోర్ట్ ఎంట్రీ (డీపీఈ) కింద అనుమతులు వేగవంతమయ్యాయి.
విశాఖ పోర్టుల్లో 29 శాతం వరకు ఈ తరహాలో ఎగుమతులు త్వరితగతిన పూర్తవుతున్నాయి. ఈ విధానంవల్ల సమయంతో పాటు డబ్బులు కూడా ఆదా అవుతున్నాయి. ఈ`సంచిత్ సాంకేతికత ద్వారా పోర్టులోకి రాకముందే ఎగుమతికి సంబంధించిన సరుకు వివరాలు, ఇతర ధ్రువీకరణ పత్రాలను అప్లోడ్ చేస్తున్నారు. ఈ సౌకర్యం తీసుకురావడంతో దాదాపు 90 శాతం సంస్థలు దీనిపైనే ఆధారపడుతూ.. ఎగుమతులను వేగవంతం చేస్తున్నాయి. ఎగుమతులకు సంబంధించి కస్టమ్స్ లైసెన్స్ను విశాఖపట్నంలో తీసుకుంటే చాలు.. దేశంలోని ఏ పోర్టు నుంచైనా.. ఏ దేశానికైనా ఎగుమతి, దిగుమతులు చేసుకునే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది.






