Davos: ‘ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్’ అంశంపై సీఎం చంద్రబాబు ప్రసంగం
దావోస్, జనవరి 20 : ఏపీని మించిన అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానం మరొకటి లేదని, పారిశ్రామికవేత్తలకు రాష్ట్రం అతిపెద్ద మార్కెట్ అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్లోని వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికపై అన్నారు. ఏపీకి వచ్చి రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తోన్న పాలసీలు, పెట్టుబడులకు ఉన్న సానుకూల పరిస్థితుల్ని స్వయంగా పరిశీలించాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను చూశాకే పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ ప్రపంచ శక్తిగా మారుతుందని, అందులో ఏపీ మొదట నిలుస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. దావోస్ పర్యటనలో రెండో రోజు జరిగిన ‘ది ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్’ అంశంపై సీఐఐ బ్రేక్ ఫాస్ట్ సెషన్లో సీఎం ప్రసంగించారు.
దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25 శాతం ఏపీ ఆకర్షించినట్టు చెప్పారు. గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, ఇంథనం, డిజిటల్ ఇన్ ఫ్రా, లాజిస్టిక్స్, తయారీ రంగాల్లో పెద్దఎత్తున పెట్టుబడులకు నెలకొన్న అవకాశాలపై సెషన్లో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు, తదితర రంగాల్లో పెట్టుబడుల గురించి ముఖ్యమంత్రి వివరించారు. గ్రీన్ అమ్మోనియా, గూగుల్ పెట్టుబడులు, ఏపీ బ్రాండ్ ఇమేజ్ గురించి పారిశ్రామిక వేత్తలకు తెలిపారు. స్పేస్ సిటీ, పోర్టులు, ఎయిర్ పోర్టులు, హైవే కనెక్టివిటీ తదితర అంశాలపై దృష్టి పెట్టినట్టు చెప్పారు. ఏపీలో కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారులకు అన్ని విధాలుగా సహకరిస్తోందని, వ్యవసాయం రంగంతో పాటు వైద్య రంగంలోను డ్రోన్లను ఉపయోగిస్తామని సీఎం చెప్పారు. 2026లో డ్రోన్ అంబులెన్స్ కూడా ఏపీ నుంచి లాంచ్ చేసే ఆలోచన చేస్తున్నామన్నారు. 1,054 కిలోమీటర్ల సముద్ర తీరం, పోర్టులు, ఎయిర్ పోర్టులు ఏపీ బలమని చెప్పారు. వచ్చే 3-4 ఏళ్లలో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం లక్ష్యంగా ప్రభుత్వ పనిచేస్తోందన్నారు.
బిజినెస్ ఫ్రెండ్లీ స్టేట్ ఆంధ్రప్రదేశ్
‘దశాబ్దాలుగా దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక సదస్సుకు హాజరవుతున్నాను. దావోస్కు వచ్చిన ప్రతిసారీ పారిశ్రామికవేత్తలు, నిపుణుల నుంచి కొత్త విషయాలు తెలుసుకుంటాను. కొత్త ఆలోచనలు పంచుకుంటాను. టెక్నాలజీ సహా వివిధ రంగాల్లో వస్తున్న మార్పులను తెలుసుకుని పాలసీలు రూపొందిస్తాను. దావోస్లో ప్రపంచ పారిశ్రామికవేత్తల ఆలోచనలు అర్థం చేసుకుని రాష్ట్రాన్ని బిజినెస్ ఫ్రెండ్లీ స్టేట్గా మారుస్తున్నాం. నాలెడ్జ్ ఎకానమీ దేశ ఆర్ధిక వ్యవస్థనే మారుస్తుంది. సంపద సృష్టి జరుగుతుంది. భారతీయులు… అందులోనూ తెలుగు ప్రజలు టెక్నాలజీని అందిపుచ్చుకోవటంలో ముందుంటారు. టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకుంటేనే అద్భుత ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుంది. మరే దేశంలో లేని యువశక్తి భారత్లో ఉంది. దేశానికి నేడు తిరుగులేని సమర్థ నాయకత్వం ఉంది.
గతంలో పారిశ్రామికవేత్తలను ఏపీకి తీసుకురావాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు. తెలుగు ప్రజల విజయాలు, ఏపీ బ్రాండ్ సానుకూల అంశంగా మారాయి. ప్రతీ రంగంలో నిర్ధిష్ట లక్ష్యాలతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది. ‘కలిసి ఎదుగుదాం… కలిసి పయనిద్దాం… భవిష్యత్ని కలిసి నిర్మిద్దాం…’ అని ముఖ్యమంత్రి అన్నారు. బ్రేక్ఫాస్ట్ సెషన్లో సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, మాస్టర్ కార్డ్ సీఏఓ, కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ సహా విదేశీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. సెషన్కి హాజరైన జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల దగ్గరకు వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆత్మీయంగా పలకరించారు.






