Dubai: దుబాయ్ పర్యటనలో భారత కాన్సుల్ జనరల్ తో చంద్రబాబు భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) తన యూఏఈ పర్యటనలో దుబాయ్లోని భారత కాన్సుల్ జనరల్ సతీష్ కుమార్ శివన్, అబుదాబీలోని డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అమర్నాథ్లతో సమావేశమయ్యారు. ప్రధాని మోదీ చొరవ వల్లే దేశంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని సీఎం అన్నారు. భారతదేశం బ్రాండ్ను ప్రధాని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారని ప్రశంసించారు. ప్రధాని మోదీ పర్యటించినన్ని దేశాలు మరే ఇతర ప్రధాని పర్యటించలేదని చెప్పారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం – పెట్టుబడులు పెరగడానికి ప్రధాని కృషే కారణమని కొనియాడారు. దుబాయ్ సహా యూఏఈ దేశాల్లోని వివిధ రంగాలకు చెందిన సంస్థలు, ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై ఈ భేటీలో చర్చించారు. గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, క్వాంటం కంప్యూటింగ్, పెట్రో కెమికల్స్, పోర్టులు, లాజిస్టిక్స్, ఏవియేషన్, ఇండస్ట్రియల్ పార్కులు, రియల్ ఎస్టేట్, డేటా సెంటర్లు, ఆతిథ్య రంగం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను చంద్రబాబు వారికి వివరించారు.
ఆంధ్రప్రదేశ్ కు ఉన్న 1054 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టినట్టు వెల్లడిరచారు. ఏపీలో లాజిస్టిక్స్ రంగాన్ని అభివృద్ధి చేసేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపారు. యూఏఈలోని వివిధ దేశాలకు చెందిన సావరిన్ ఫండ్స్ నుంచి ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశంపై ప్రత్యేకంగా చర్చించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అనుమతులు ఇస్తోందని సీఎం వెల్లడిరచారు. యూఏఈలో ఉన్న తెలుగు వారికి ఇండియన్ ఎంబసీ సహకారం అందించే అంశంపై భేటీలో చర్చ జరిగింది. ఆయా దేశాల్లో ఉన్న 4.08 లక్షల మంది తెలుగు ప్రజలకు అవసరమైన సహకారాన్ని అందించాలని ఎంబసీ ప్రతినిధులను చంద్రబాబు కోరారు. ఈ సమావేశంలో సీఎంతో పాటు మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.







