Kandula Durgesh: నంది నాటకోత్సవాలు, అవార్డులను పునరుద్ధరిస్తాం.. ‘ఆవకాయ అమరావతి’ ఉత్సవాల్లో కందుల దుర్గేష్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలో జనవరి 8 నుంచి 10 వరకు మూడు రోజుల పాటు ‘ఆవకాయ అమరావతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. భవానీ ద్వీపం, పున్నమి ఘాట్లో ఈ ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నృత్యం, సంగీతం, సినిమా, సాహిత్యం వంటి అంశాలపై పలు కార్యక్రమాలు, చర్చలు, ప్రదర్శనలు నిర్వహించారు. ముగింపు వేడుకల్లో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో త్వరలో నంది నాటకోత్సవాలను నిర్వహించడంతో పాటు నంది అవార్డులను ప్రదానం చేస్తామని అన్నారు. విజయవాడలోని పున్నమిఘాట్ వేదికగా మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఆవకాయ్- అమరావతి ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతూ, వైకాపా ప్రభుత్వం ఏనాడూ ఇలాంటి కళా, సాంస్కృతిక వైభవానికి చోటివ్వలేదని..ఆ ఐదేళ్లలో కళలు పూర్తిగా అణగారిపోయాయని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలోనే ఉగాది, కందుకూరి పురస్కారాలను అందించామని చెప్పారు. కోనసీమలో నిర్వహించే ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారని తెలిపారు. డిసెంబరు 17, 18, 19 తేదీల్లో విజయవాడ పున్నమిఘాట్ వేదికగా మరోమారు ఆవకాయ్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఆవకాయతో తెలుగువారికి విడదీయరాని సంబంధం ఉందని, అందుకే సంక్రాంతి పండగ నేపథ్యంలో ఆవకాయ్- అమరావతి కార్యక్రమం మూడు రోజులు పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించుకున్నా మని చెప్పారు. గతంలో సాహిత్యానికి, నాటకానికి వేర్వేరుగా వేదికలు ఉండేవని, ప్రస్తుతం పాత, కొత్త మేలి కలయికతో ప్రదర్శనలు నిర్వహించినట్లు తెలిపారు. ‘ఆవకాయ్- అమరావతి’ ఉత్సవాలను ఒక బ్రాండ్గా తీర్చిదిద్దుతామని కూడా చెప్పారు.
‘సుందరమైన తెలుగు-తెలుగు సాహిత్యం, సినిమా వైభవం’
గడిచిన వెయ్యి ఏళ్లలోనే తెలుగు సాహిత్యం ఆద్భుతంగా విరాజిల్లిందని పలువురు రచయితలు అభిప్రాయపడ్డారు. నేటి సోషల్ మీడియా యుగంలోనూ భాష దినాదినాభివృద్ధి చెందుతోందని తెలిపారు. ‘ఆవకాయ్-అమరావతి’ కార్యక్రమంలో ‘సుందరమైన తెలుగు- తెలుగు సాహిత్యం, సినిమా వైభవం’ అంశంపై విజయవాడలోని భవానీ ద్వీపంలో జరిగిన చర్చలో ప్రముఖ రచయితలు కస్తూరి మురళీకృష్ణ, మామిడి హరికృష్ణ, మౌనశ్రీ మల్లిక్, శ్రీపతి శర్మ వేదాంతం పాల్గొన్నారు. స్పష్టత, వైవిద్యంతో కూడిన విశిష్టతను సొంతం చేసుకుని, రూపం, ఉచ్ఛరణ, అక్షర నిర్మాణం, భావార్థం, పదార్థం మేళవింపులతో సుందరీకరణ చెంది, పదాల పోహలింపు, అమరికతో తెలుగు రోజురోజుకు ఎంతో అందంగా తయారవుతోందని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే వారి సంఖ్య 12 కోట్లకు చేరిందని వెల్లడిరచారు. భావాలకు పుట్టినిల్లుగా తెలుగును కీర్తించారు. ఎలా చదువుతు న్నామో, ఎలా మాట్లాడుతున్నామో అనే విషయాలకు దూరమవుతున్న పరిస్థితుల్లోనూ తెలుగు వెలుగులు విరజిమ్ముతుండటం సంతోషించదగిన విషయమ న్నారు. పదేళ్లకు ఒకసారి తరం మారుతుంటుందని, ప్రతి తరంలోనూ భాష ఉచ్ఛరణలో మార్పులు సంభవిస్తుంటాయని, ఈ తరుణంలోనే భాష దిగజారి పోతుందనే భావన పాత తరం వారిలో కలుగుతుండటం సర్వసాధారణమని వివరించారు. తరాలకు తగినట్లుగా పదాలు మారుతుంటాయని, కొన్ని అక్షరాలు, పదాలు మాయమై, కొత్తవి పుట్టుకువస్తాయని, దీన్ని రచయితలు ఆహ్వానించాలని హితవు పలికారు. మాండలికాలను గౌరవించుకుంటూ, నైతిక విలువలను అర్థం చేసుకుంటూ.. కొత్త తరం పుట్టించిన పదాలకు పాత తరం పదాలను జోడిరచి రచనలను కొనసాగిస్తూ భాషను ముందుకు నడిపించాలని సూచించారు.
ఆవకాయ్-అమరావతి ఉత్సవాల్లో భాగంగా పున్నమి ఘాట్లో తెలుగు భాష యాసలు అన్నింటినీ కూర్చి చౌరస్తా బృందం చేసిన గానం ఆకట్టుకుంది. ఎన్.టి.రామారావు జీవిత ప్రస్థానంపై ఏవీ ప్రదర్శించారు. ఎన్టీఆర్ జీవిత వైభవాన్ని నేటి తరానికి వేదికలపై ఉన్న ప్రముఖులు గుర్తు చేశారు. 300కు పైగా సినిమాల్లో నటించి, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందమే కాకుండా తెలుగువారి ఆత్మగౌరవానికి చిరునామాగా మారారని కీర్తించారు. అనంతరం ప్రేమ కథ చిత్రమ్ అనే సంగీత నాటికను ప్రదర్శించారు. చివరిగా జావెద్ ఆలీ సంగీత కచేరీతో కార్యక్రమం ముగిసింది.
తెలుగు అనువాదాలకు ప్రాధాన్యం పెరగాలి
‘అనువాద కళ’ చర్చలో రచయితలు కె.శ్రీనివాసరావు, జయప్రద, విజయ్కుమార్, మరియా పూరి(పోలాండ్) మాట్లాడుతూ అనువాద రచనలకు ప్రాధాన్యం పెరగాలని అభిప్రాయపడ్డారు. బెంగాలీ నవలలే అధికంగా అనువాదం అవుతున్నా యని, ఆ ధోరణి తెలుగు నవలలకూ రావాలని ఆకాంక్షించారు. మన రచనలు ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోకి వెళ్లాలని, ఇతర భాషల నుంచి తెలుగుకు అనువాదమైన రచనలకు ఆదరణ పెరగాలని, అందుకు పబ్లిషర్లు ముందుకు రావాలని కోరారు. ‘నీటిపై రాతలు-తెలుగులో కథ చెప్పే కళ’ అంశంపై రచయితలు బ్నిం, సున్నపురెడ్డి వెంకట్రామి రెడ్డి మధ్య, ‘శుక్రవారం విడుదల-సినిమా, పాత్రికేయ వృత్తి’ అనే అంశంపై రచయితలు చల్లా భాగ్యలక్ష్మి, వర ముళ్లపూడి, వడ్డి ఓంప్రకాశ్ నారాయణ మధ్య సంభాషణలు సాగాయి. స్టోరీ అవర్ యుకే బృందం ప్రదర్శించిన సార్వత్రిక కథలు ఆకట్టుకున్నాయి. ఉత్సవాలను విజయవంతం చేసిన అధికారులు, టీం వర్క్స్ ఆర్ట్స్ ప్రతినిధులను ఆయన అభినందించారు. ఎమ్మెల్యేలు బొండా ఉమా మహేశ్వరరావు, వసంత కృష్ణప్రసాద్, షాజహాన్ బాషా పాల్గొన్నారు.
కృష్ణా నది తీరంలో పున్నమిఘాట్ వద్ద ఏర్పాటు చేసిన భారీ సెట్ వద్ద.. నిత్యం సాంస్కృతిక కార్యక్రమాలు, సినీ గీతాలాపన, మ్యూజికల్ బ్యాండ్స్, తోలుబొమ్మలు, నగాడా, డప్పు కళాకారుల ప్రదర్శన లతో.. ఈ ప్రాంతమంతా సందడి నెలకొంది. దేశ విదేశాల నుంచి కళాకారులు తరలివచ్చి ప్రదర్శ నలు ఇచ్చారు. చివరి రోజు కూడా ఉదయం 11 గంటల నుంచి భవానీద్వీపంలో పలు అంశాలపై సంభాష ణలు, సంక్రాంతి స్కిట్లు, చిన్నారుల కర్ర సాము, మార్షల్ ఆర్ట్స్ శిక్షణ శిబిరాలు నిర్వహించారు.






